మహేశ్ మనసులో వారికి స్థానం లేనట్టే!
on Feb 5, 2018
‘అనుకున్నామనీ...జరగవు అననీ... అనుకోలేదనీ అగవు కొన్ని’ అన్నాడు ఓ మహాకవి. మనం ఒకటి అనుకుంటాం. కానీ దైవం ఒకటి తలుస్తుంది. మహేశ్ ప్రస్తుతం ఇలాంటి నైరాశ్యంలోనే ఉన్నాడు. ‘శ్రీమంతుడు’ ఆడియో వేడుకలో అభిమానులకు తను ఓ మాటిచ్చాడు. ‘ఇక నుంచి ప్రయోగాల జోలికి పోను... మిమ్మల్ని నిరుత్సాహపరచను’ అని. కానీ... ఆ తర్వాతే బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో అభిమానుల్ని ఓ రేంజ్ లో నిరుత్సాహానికి గురి చేశాడు ప్రిన్స్. పాపం.... ఆ రెండు సినిమాలపై తను పెట్టుకున్న నమ్మకం సాధారణమైంది కాదు. కచ్చితంగా హిట్లే అనుకున్నాడు మహేశ్. కానీ దారుణంగా బెడిసికొట్టాయ్. అందుకే... ఈ దఫా మాటలతో కాకుండా చేతలతో తనేంటో రుజువు చేయాలనుకుంటున్నాడు మహేశ్.
తన నమ్మకాన్ని వమ్ము చేసిన సీనియర్ దర్శకులను ఆయన కొన్నాళ్లు పక్కన పెట్టేయాలనుకుంటున్నాడని అంతరంగిక సమాచారం. ప్రస్తుతం మహేశ్ ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పైడిపల్లి వంశీ సినిమాకు ‘ఓకే’ చెప్పాడు మహేశ్. ఈ రెండు సినిమాల తర్వాత కేవలం యంగ్ టాలెంటెడ్ దర్శకులకే అవకాశం ఇవ్వాలని గట్టిగా ఫిక్సయ్యాడట మహేశ్.
ముందుగా ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశాడట. ఆ సినిమాకు ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత కూడా కొత్త వాళ్లతోనే చేస్తాడట ప్రిన్స్. యంగ్ డైరెక్టర్ల వద్ద.. తన ఇమేజ్ కు, బాడీ లాగ్వేజ్ కూ తగ్గట్టుగా కథలు ఉంటే... వాటిని పరిశీలించడానికి ఓ టీమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నాడట ప్రిన్స్. తనకు తగ్గ కథలు ఉంటే... వాటిని లాక్ చేసే విధంగా ముందుకెళ్తున్నాడట. ఏది ఏమైనా.... బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు మహేశ్ కి బాగానే జ్ఙానోదయం చేశాయ్. ఏమంటారు?