టాలీవుడ్ ఎంతలా మారిపోయిందో..!!
on Jan 29, 2018
పైకి ఎంతగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నప్పటికీ.. తెలుగునాట హీరోల మధ్య ఇగోలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర హీరోల సంగతి పక్కన బెడితే.. ఒకే కుటుంబంలోని హీరోల మధ్య ఏ మాత్రం సంబంధాలు బాలేవన్నది ఇండస్ట్రీ మాట.. అయితే ఇటీవలి కాలంలో ఆ పరిస్థితులు మారిపోయాయని చెప్పవచ్చు. తనకు పోటీ అనుకున్న హీరో సినిమా విడుదలవుతుంటే.. ఇంకో హీరో సోషల్ మీడియాలో ఆల్ది బెస్ట్ చెప్పడం.. బాగుంటే బాగుందని చెప్పడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.
చిన్న, సన్నకారు హీరోలు కాబట్టి అలా చేయడంలో వింతేమి లేదే. కానీ దశాబ్ధాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న అగ్రకథానాయకుల వైఖరిలో కూడా మార్పు రావడం ఆశ్చర్యకరం. అది కూడా ప్రత్యర్థులుగా చెప్పుకునే రెండు కుటుంబాల మధ్య స్నేహపూరిత వాతావరణం రావడం అభిమానులను సైతం ఆలోచింపచేస్తోంది. నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు.. మెగా హీరో పవన్కళ్యాణ్ స్వయంగా వచ్చి క్లాప్ కొట్టి ఆల్ ది బెస్ట్ చెప్పి మరి వెళ్లాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే రామ్చరణ్-ఎన్టీఆర్ల మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. ఇక రీసెంట్గా యంగ్హీరో నాగశౌర్య నటించిన చలో ఆడియో లాంఛ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అటెండవ్వడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది.
ఒక చిన్న హీరో కార్యక్రమానికి చిరు స్థాయి వ్యక్తి రావడమే ఇక్కడ మేటర్.. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నా సినిమా 100 రోజుల ఫంక్షన్కి ఒక స్టార్ హీరోని ఆహ్వానించానని.. కానీ ఆయన రాలేదని.. ఆ స్టార్ హీరో వచ్చుంటే తాను ఎంతో సంతోషించేవాడినని.. అలాంటి పరిస్థితి నాగశౌర్యకి రాకూడదనే తాను వచ్చానని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఇక మరో మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తన సినిమాలు తప్ప.. బయటి ప్రపంచాన్ని పట్టించుకోని బాలయ్య ఈ మధ్య కాలంలో తోటి హీరోలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మొన్నామధ్య తన తోటి హీరో రాజశేఖర్ నటించిన పీఎస్వీ గరుడవేగ మూవీ ఈవెంట్కు వెళ్లి సినిమా బాగా ఆడాలని విష్ చేసి వచ్చారు. సూపర్స్టార్లు ఈ విధంగా సపోర్ట్ చేస్తే కొత్తరక్తం ఉరకలేత్తుతుంది.. వారు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలను చేస్తారని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.