పవన్ కు తలనొప్పిగా మారిన త్రివిక్రమ్ చేతలు?
on Jan 2, 2018
చిన్న హీరోల సినిమాల కథల విషయంలో వివాదాలు తలెత్తితే... చిన్న చిన్న పంచాయితీలతో అవి సద్దుమణుగుతాయ్. కానీ... పెద్ద హీరోల సినిమాల కథల విషయంలో వివాదాలు మొదలైంతే... ఆ రచ్చను ఆపడం కష్టం. అందుకే... కథల విషయంలో దర్శక, నిర్మాతలు జాగ్రత్తగా ఉండాలి. క్లారిటీగా ఉండాలి. నిజాయితీ కూడా ఇక్కడ అవసరమే. మరో కథను ప్రేరణగా తీసుకుంటే ఫర్లేదు కానీ.. కాపీ చేయకూడదు. ఈ విషయంలో ముఖ్యంగా దర్శకులు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే... టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం చిన్నదైపోయింది. మనం ఎక్కడ చూసి కాపీ కొట్టినా.. వెంటనే పట్టేస్తోంది మీడియా.
ఇప్పుడు పవన్ ‘అజ్ఙాతవాసి’ విషయంలో కూడా ఇలాంటి గొడవే మొదలయింది. ఇది పవర్ స్టార్ సిినిమా కావడంతో... ఈ రచ్చ బయటకు రాకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్త వహిస్తున్నారు. బాధితులు కూడా నిజమని తేలేదాకా మౌనంగానే ఉండాలని నిర్ణయించారు. ఇక విషయంలొకెళ్తే.
ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లార్గో వించ్' సినిమా కథ,.. ‘అజ్ఞాతవాసి' కథ ఒక్కటే అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ఫ్రెంచి మూవీ హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘టి-సిరీస్' అలర్ట్ అయింది. ‘అజ్ఙాతవాసి’ దర్శక నిర్మాతలకు కోర్టు ద్వారా నోటీసులు కూడా ఇచ్చింది. ఈ పరిణామంతో ఖంగు తినడం... ‘ఆజ్ఙాతవాసి’ టీమ్ వంతైంది.
‘మీ సినిమా కథ.. మేం బాలీవుడ్ హక్కులు కొనుక్కున్న ఫ్రెంచి సినిమా కథ ఒకేలా ఉందని తెలిసింది. మా సినిమాను మీరు కాపీ కొట్టి తీశారనేది మా అభియోగం. మీరు ఒకసారి ‘అజ్ఙాతవాసి’ సినిమాను మాకు చూపించాలి. ఆ సినిమా మా సినిమాకు నిజంగా కాపీనే అని తెలిస్తే.. మాకు నష్టపరిహారం చెల్లించాలి’ అనేది ఆ నోటీస్ ఆంతర్యం.
అయితే... ఈ విషయంలో ‘అజ్ఙాతవాసి’ దర్శక, నిర్మాతలు మాత్రం మౌనంగా ఉన్నారు. వారి మౌనం చూస్తే... నిజంగానే ‘లార్గో వించ్’ని కాపీ కొట్టారేమో అని అనుమానం కలుగుతోంది. టీ సిరీస్ యాజమాన్యం కూడా నిజం తేలేదాకా మౌనంగానే ఉండాలని నిర్ణయించింది. ఒకవేళ నిజంగానే ‘అజ్ఙాతవాసి’ కథ కాపీనే అని తేలితే... ‘అజ్ఙాతవాసి’ నిర్మాత... టీ సిరీస్ వాళ్లకు భారీగానే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది.
మాటల రచయితగా... గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న త్రివిక్రమ్... ఓ విషయంంలో పలు విమర్శలకు గురవుతున్నాడు. అదే... కాపీలు కొట్టడం. తాను మహేశ్ తో తీసిన ‘అతడు’ సినిమా వెంకటేశ్ ‘వారసుడొచ్చాడు’ సినిమాకు కాపీ అని అప్పట్లో అందరూ విమర్శించారు. ఇక ‘అ ఆ’ సినిమా కథ విషయంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ నవలను కాపీ చేసి... కనీసం ఆ విషయాన్ని కూడా ఆమెకు తెలియజేయలేదు. తర్వాత గుట్టు రట్టు అవ్వగానే.. ఆమెకు నష్టపరిహారం అందించి.. టైటిల్స్ లో ఆమెకు కృతజ్ఙతలు తెలిపాడు. ఇప్పుడు ‘అజ్ఙాతవాసి’ విషయంలో ఈ వివాదం.
మరి ఇంకో వారం రోజుల్లో సినిమా రాబోతోంది. ఈ లోపు.. ఈ గొడవ ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.