కన్నీరుమున్నీరైన దిల్ రాజు
on Dec 26, 2017
డి.రామానాయుడు తర్వాత అంత పేషన్ తో సినిమాలు నిర్మించే నిర్మాత ఎవరు? అనడిగితే... ఎవరైనా ‘దిల్ రాజు’ అనే చెబుతారు. తన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చకున్న దిల్ రాజు. దానికి తగ్గట్టే... ఎంతోమంది దర్శకులను పరిచయం చేసి ‘దిల్’ ఉన్న నిర్మాత అనిపించుకున్నాడు. ఇప్పటికి ఓ 30 సినిమాలు నిర్మించి ఉంటాడు తను. అందులో హిట్లు ఉన్నాయ్ ఫ్లాపులూ ఉన్నాయ్. కానీ... విజయాలకు పొంగకుండా... అపజయాలకు కృంగకుడా ముందుకు సాగిపోతున్నాడు దిల్ రాజు. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్ రాజు... ఇటీవల ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యాడు. దానికి కారణం ఒకటి కాదు.చాలా ఉన్నాయ్.
20 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాల నుంచి.. నిర్మాతగా తన కెరీర్ లో ఎదురైనా ఆటుపోటల నుంచి... రీసెంట్ గా కన్నుమూసిన తన సహధర్మచారిణి వరకూ ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యాడు దిల్ రాజు.
‘ఫిదా’ షూటింగ్ అమెరికాలో జరుగుతన్న సమయంలో తన భార్య కన్నుమూసిన వార్త విని... కుప్పకూలిపోయాననీ... ఆ క్షణాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యాడు. స్టేజ్ పై ఉన్న పలువురు దర్శకులు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేసినా... రాజుగారికి కన్నీరు ఆగలేదు. సున్నిత మనస్కుడు కాబట్టే.. ఆ ఉద్వేగమని ఆ సభకొచ్చిన పలువురు అభిప్రాయపడ్డారు.