" అలా " పిలిస్తే సమంతకు బాధనిపిస్తుందట..!!
on Dec 26, 2017
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కథానాయికల్లో సమంత ఒకరు. తన ప్రతి అనుభవాన్నీ సోషల్ మీడియాతో పంచుకోవడం సామ్ స్పెషల్. దానికి తగ్గట్టే ఫాలోవర్స్ కూడా సమంతకు ఎక్కువే. అయితే.. ఈ మధ్య ఫాలోవర్స్ వల్ల సమంత బాధకు గురయ్యిందట. కారణం ఏంటో తెలుసా?
తను ఇప్పటికి ఓ యాభై సినిమాలు చేసుంటుందా! కానీ... వాటి వేటి గురించీ పెద్దగా చర్చించని అభిమానులు... ప్రతిసారీ సమంతను ‘జెస్సీ...జెస్సీ’ అని... ఏడేళ్ల క్రితం తాను చేసిన ‘ఏ మాయ చేశావే’ పాత్రనే ఇంకా వారు జపం చేస్తుండటం చూసి సమంతకు బాధ అనిపించిందట. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సామ్.
ఈ ఏడేళ్లలో చాలా సినిమాలు చేశాను. నటనలో పరిణతి సంపాదించానని కూడా చాలా సందర్భాల్లో అనుకున్నా. కానీ... వాటి వేటి గురించి మాట్లాడకపోగా.. ఇంకా ‘జెస్సీ’ నామస్మరణే చేస్తున్నారు. నేను సరిగ్గా నటించడం లేదా? ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ వృధా నేనా? ఇంకా ‘జెస్సీ’నే అందరూ గుర్తు చేసుకోవడం పట్ల ఆనందించాలో..బాధ పడాలో అర్థం కావడంలేదు’ అంటూ వాపోయింది సమంత.
నిజానికి ‘ఏమాయ చేశావే’ సినిమా సమంతకు స్పెషల్. ఎందుకంటే. చైతూతో తొలిసారి కలిసి నటించిన సినిమా అదే. అప్పట్నుంచీ వీరి మధ్య స్పేహం మొదలై.. అది ప్రేమగా పరిఢమిల్లి... పరిణయానికి దారి తీసింది. పైగా ఆ సినిమా అంటే సమంతకు చాలా ఇష్టం. కానీ... ఒక నటిగా మాత్రం ప్రతిసారీ ‘జెస్సీ..జెస్సీ’ అని అందరూ అంటుంటే బాధ కలుగుతుందట.
వైవాహిక జీవితంతో మొన్నటిదాకా తలములకలైన సమంత... ఇప్పుడు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయంది. జనవరి 26న ఆమె నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబుదరై’ విడుదల కానుంది. అలాగే మార్చి 29న ‘మహానటి’... మార్చి 20న ‘రంగస్థలం’ కూడా విడుదలవనున్నాయ్.