నాగ్-బాలయ్య కావాలని కలవలేదా..?
on Dec 19, 2017
తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ల లాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ల మధ్య ఆ కాలంలో ఎంతటి పోటీ ఉన్నా.. ఇద్ధరు ఎంతో స్నేహాంగా మెలిగేవారు. అక్కినేనిని అన్నగారు సోదరుడిగా భావించేవారు.. ఆయన కూడా ఎన్టీఆర్ పట్ల ఎంతో అభిమానం చూపించేవారు. వారి మధ్య అభిప్రాయభేదాలు చాలా అరుదుగా వచ్చేవి.. వారి వారసులుగా తెరకు పరిచయమైన బాలకృష్ణ, నాగార్జున ఎన్నో ఏళ్లుగా అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నప్పటికీ.. వీరిద్దరూ కూడా తండ్రుల బాటలోనే నడుస్తూ.. సొంత అన్నదమ్ముల్లా మసలుతూ వచ్చారు. అయితే కారణాలేమిటో తెలియదు కానీ.. కొద్ది రోజులుగా నాగ్, బాలయ్య మధ్య గ్యాప్ వచ్చింది. శ్రీరామరాజ్యంలో ఏఎన్నార్, బాలయ్య కలిసి నటించినప్పటికీ.. ఏఎన్నార్ చనిపోయినప్పుడు మాత్రం బాలయ్య అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. అంతేకాకుండా.. ఆయన మృతిపై స్పందించలేదు కూడా.
దానికితోడు..ఒకట్రెండు సందర్భాల్లో నాగ్, బాలయ్య ఒకరికొకరు ఎదురుపడినా సరే పలకరించుకున్న సందర్భాలు లేవు. రీసెంట్గా నాగచైతన్య రిసెప్షన్కి నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ మాత్రమే హాజరవ్వగా.. బాలయ్య జాడ కనిపించలేదు. ఇక తెలుగు భాష పరిరక్షణ, వికాసం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్బి స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా నాలుగో రోజు సాయంత్రం తారా లోకం దిగివచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా ఒకే వేదికపైకి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.
దీనికి బాలయ్య, నాగార్జున కూడా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరూ ఒకే వేదిక మీదకు రావడంతో అక్కడున్న సినీ ప్రముఖులు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఏమైనా మాట్లాడుకుంటారా..? కనీసం పలకరించుకుంటారా..? అని ఎదురుచూసిన వారికి నాగ్-బాలయ్య నిరాశను మిగిల్చారు. గవర్నర్ నరసింహన్కు అటుపక్క నాగ్.. ఇటుపక్క బాలయ్య కూర్చొన్నారు. నాగార్జునను సత్కరించే సమయంలో చివరన ఎక్కడో బాలయ్య ఉండగా.. బాలకృష్ణకు గవర్నర్ శాలువా కప్పేటప్పుడు నాగ్ పక్కనే ఉన్నా పట్టించుకోలేదు. ఇదంతా చూస్తున్న వారికి ఈ అగ్ర కథానాయకులు ఎప్పటికైనా కలుస్తారా అన్న సందేహం కలిగి ఉండొచ్చు అంటున్నారు ఫిలింనగర్ జనాలు.