నేను చెబుదామనుకున్నా.. ఇంతలో?
on Nov 4, 2017
మీడియా ఎంత త్వరగా రెస్పాండ్ అవుతుందో... అంతకంటే వేగంగా రెస్పాండ్ అవుతుంటాడు రామ్ గోపాల్ వర్మ. అందుకే.. ఆయన్ను కూడా ఓ విధంగా మీడియా పర్సననే అనాలి. అందుకేనేమో.. నాగార్జున వర్మను మీడియాగా సంభోదించాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే చిత్రం నవంబర్ 20 నుంచి మొదలు కానుంది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ప్రకటిద్దాం అనుకున్నాడట. కానీ.. బయటకొచ్చేసింది. దానికి కారణం వర్మ. ఆయనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీనిపై నాగ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘ఈ నెల 20న మొదలు కానున్న నా సినిమా వివరాలు నేనే స్వయంగా ప్రకటిద్దామనుకున్నాను. కానీ.. మీడియా దాన్ని ప్రకటించేసింది’ అని ట్వీట్ చేశాడు నాగ్. ఇక్కడ మీడియా అంటే ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏదీ ఏమైనా వర్మ వేగం.. ఒక్కోసారి లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంటుంది. నిజానికి ఎన్టీయార్ బయోపిక్ బాధ్యతను ముందు వర్మకే అప్పజెప్పాలనుకున్నాడు బాలయ్య.
ఆ విషయం ఆయన అధికారికంగా ప్రకటించకముందే.. వర్మగారూ... ఫేస్ బుక్ లోకి దూరిపోయి మరీ ప్రకటించేశాడు. అంతేకాదు.. ఎన్టీయార్ పేరిట ఓ పాట కూడా రాయించేసి, స్వయంగా పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఏమైందీ..? రచ్చ రంబోలా అయ్యింది. అందరూ తలోమాట అన్నారు. ఎలాగూ తాను ప్రకటించలేదు కాబట్టి.. బాలయ్య తేలిగ్గా అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు. అదే బాలయ్య ఆ విషయం ప్రకటిస్తే.. ఇక వెనక్కు తగ్గేవాడు కాదు. ఆ విషయం బాలయ్యను దగ్గరగా చూసిన ఎవరైనా చెబుతారు. ఈ తొందరపాటు అన్నివేళలా మంచిదికాదు వర్మగారూ.. అందరూ నాగ్ గారిలా ఉండరు. అర్థమైందా.