‘రాజుగారి గది’లో ఇన్ని దోషాలా?
on Oct 14, 2017
కొన్ని సినిమాలు ఎందుకు హిట్లు అవుతాయో... ఎందుకు ఫట్ అవుతాయో... చెప్పలేం. టాక్ ఓ విధంగా వస్తుంది. రిజల్ట్ మరో విధంగా ఉంటుంది. క్రిటిక్స్ బాగుందని రాసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయ్. క్రిటిక్స్‘చెత్త’ అని రాసిన సినిమాలు.. వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయ్. ప్రధాన అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్ల నాడిని ఎలాగైతే పసిగట్టలేమో... సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల నాడిని కూడా అలాగే కనిపిట్టలేం.
శుక్రవారం ‘రాజుగారి గది 2’ విడుదలైంది. క్రిటిక్స్ అందరూ సినిమా బాగుందనే రాశారు. అయితే... థియేటర్లు మాత్రం ఈగల్ని తోలుకుంటున్నాయ్. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేస్తే... క్రిటిక్స్ కు కూడా అంతుచిక్కని విషయాలే వెలుగు చూశాయ్. సగటు ప్రేక్షకుడిని మాత్రం ‘రాజుగారి గది 2’ సరిగ్గా ఆకట్టుకోలేకపోయిందని టాక్. దానికి గల కారణాలు ఇలా ఉన్నాయ్.
1. తొలి అరగంట సినిమా సహనానికి పరీక్ష పెట్టిందని. నవ్వించడానికి తెరపై అందరూ ప్రయత్నించారు కానీ.. నవ్వు రాలేదని.. కనీసం భయం కూడా కలగలేదని చాలామంది అంటున్నారు.
2. నాగార్జునది ఇందులో ఓ మెంటలిస్ట్ పాత్ర. కానీ.. దైవాంశసంభూతునిలా ప్రవర్తిస్తుంటాడు. కళ్లను బట్టి మనసును చదవడం వరకు ఓకే. మనిషిని చూసి గతంలో జరిగిందేంటో చెప్పేయడం ఏంటి? ఈ వ్యవహారాన్ని చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట జనాలు. అంతే కాదు... నాగ్ ఈ సినిమాలో చేసిందంతా ఇన్విస్టిగేషన్ లా లేకుండా... ఇంటరాగేషన్ లా ఉందనీ.. ప్రతిదానికీ లెక్చర్లు ఇచ్చేయడం ఏంటని? కొందరి వాదన.
3. సమంతది ఇందులో దెయ్యం పాత్ర. కానీ... ఎక్కడా దెయ్యంలా అనిపించదు. కనీసం.. ఆమె చుట్టూ ఎఫెక్ట్స్ కూడా పెట్టకపోవడం ఏంటి? అని కొందరు అంటున్నారు.
4. ‘చంపుదామనుకున్నవాడ్నికూడా చంపకుండా వదిలేయడం నిజమైన మానవత్వం’.. అని తండ్రి చెప్పగానే.. వెంటనే అభినయను వదిలేసి వెళ్లిపోతే బావుండేదనీ... ఆ తర్వాత నాగార్జున పక్కన కూర్చొని అంతసేపు డిస్కషన్ దెయ్యానికి ఉండకూడదని కొందరి అభిప్రాయం.
5. ఎవరో చేసిన తప్పుకు సమంత బాధ్యురాలు ఎలా అవుతుంది? సమాజం ఆమెను ఎందుకు టార్గెట్ చేసింది? చివరకు తండ్రి చనిపోయిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఎందుకు నిందించారు? ఒక వేళ తనే ఆ వీడియో షూట్ చేసుకొని తనే అప్ లోడ్ చేసుకుందనే అనుమానం జనాలకు కలిగిందనుకుందాం. అలా జనాలు నమ్మడానికి తగ్గట్టుగా ఓ సీన్ ఉండాలి కదా. క్లారిటీ ఎక్కడుంది? అనేది కొందరి వాదన.
6. కేవలం నాగార్జునకు ఓ చిన్న యాక్షన్ సన్నివేశం అయినా ఉండాలనే ఉద్దేశంతో ఆ కాలేజ్ సన్నివేశం పెట్టినట్టు ఉంది కానీ.. చనిపోయిన అమ్మాయి గురించి కూడా అంత అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు.
7. క్రిస్టియన్స్ నుంచి కూడా ఈ సినిమా విమర్శలు వినిపిస్తున్నాయ్. హాలీవుడ్ హారర్ సినిమాల్లో సైతం శిలువను చూసి దెయ్యం భయపడటం చూశాం. ఈ సినిమాలో శిలవను చూసి కూడా దెయ్యం భయపడకపోవడం... ‘ఈ దెయ్యాన్ని వదలించడం మా వల్ల కాదు’అన్నట్లు పాస్టరే ప్రవర్తించడం ఏంటి? మతాభిమానాన్ని ప్రదర్శించడానికి ఇదేనా దారి? అని ప్రశ్నిస్తున్నారు.