బాలయ్య కోపాన్ని... వర్మ తట్టుకోగలడా?
on Oct 10, 2017
అనుకున్నదే అయ్యింది... ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమాను ఎవరు నిర్మిస్తారు? అనేది మొన్నటిదాకా చర్చనీయాంశమైన విషయం. ఈ విషయంలో చాలామంది అనుకున్నదే నిజమైంది. వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ నిర్మాత వెనుక ఎవరుంటారో ప్రత్యేకించి చెప్పేదేముంది గోవిందా..
ఏది ఏమైనా వర్మ.. జాక్ పాట్ కొట్టేశాడు. ఈ సినిమా పుణ్యమా అని డబ్బుని మంచినీళ్లుగా ఖర్చుచేయడం ఖాయం. వర్మకు కూడా ఘనంగానే ముట్టడం ఖాయం. లక్ష్మీపార్వతి పాత్రను పాజిటీవ్ గా చూపిస్తూ... చంద్రబాబుని టార్గెట్ చేసేలా ఈ సినిమా ఉండబోతోందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇదివరకే విడుదల చేసిన వర్మ... ఈ సినిమాను చిత్తూరు జిల్లా పలమనేరులో అధికారికంగా ప్రకటించారు. ‘ఎన్టీయార్ జీవితం మహాభారతం లాంటిది. అందులో లక్ష్మీపార్వతి ఎంట్రన్స్ నుంచి కథ తీసుకున్నాను. నాకు తెలిసిన నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నాను. ఎన్టీయార్ ఎవడబ్బ సొమ్ము కాదు. ఎన్టీయార్ ప్రజల సొత్తు. నిజం నిర్భయంగా చెబుతాం. 2008లో సినిమాను మొదలుపెట్టి... అక్టోబర్ లో విడుదల చేస్తాం. ఎన్టీయార్, లక్ష్మీపార్వతి పాత్రలతో పాటు.. మరో కీలక పాత్ర కూడా ఈ కథలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియపరుస్తాం’ అని వర్మ తెలిపాడు.
వచ్చే ఏడాది అక్టోబర్ లో సినిమాను విడుదల చేస్తాడట. ఎన్నికల వేడితో రగిలిపోయే సమయం అది. సరిగ్గా ఆ టైమ్ లోనే సినిమాను విడుదల చేయాలనే తలంపులోనే అసలు విషయం అర్థమవుతోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో? ఇప్పటికే ఎన్టీయార్ బయోపిక్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్న బాలయ్య ఏ విధంగా రియాక్టవుతారో చూడాలి.
బాలయ్యకు కోపం వస్తే... ప్రమాదకరంగా ఉంటుందని తెలుసు. వర్మ ఎవరి మాట వినని సీతయ్య అని కూడా తెలుసు. లక్ష్మీపార్వతి వ్యవహారం అంటే... హరికృష్ణ కు కూడా కోపం తెప్పించే అంశమే. మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.