అన్నయ్య మీద గుర్రుగా ఉన్న నాగార్జున... కారణం ఇదే!
on Oct 4, 2017
అన్నయ్య అంటే సొంత అన్నయ్య వెంకట్ గారు కాదండోయ్. తెలుగు టీవీ ప్రేక్షకులకి ఆట షో ద్వారా సుపరిచితుడయిన ఓంకార్ అన్నయ్య. జీనియస్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఓంకార్ అన్నయ్య, తర్వాత రాజు గారి గది తో మొదటి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. తన తదుపరి చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత పీవీపీ ముందుకు రావడంతో, ఓంకార్ కి నాగార్జున తో జత కట్టే అవకాశం వచ్చింది. ఈ సినిమాకి మాతృక మలయాళం హిట్ సినిమా ప్రేతమ్ అయినప్పటికీ, ఓంకార్ పలు మార్పులు, చేర్పులు చేసినట్టు తెలిసింది. కథ నచ్చడం, పీవీపీ కి అంతకు ముందు ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉండడంతో, రాజు గారి గది 2 కి నాగార్జున ఓకే చేసారు. అయితే, సినిమా మొదలయిన తర్వాత అసలు విషయం బయటపడింది. మొదటిసారి నాగార్జున లాంటి అగ్ర నటుడిని డీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఓంకార్ కాస్త తడబడి మొదట్లో కొన్ని తప్పులు చేసాడట. కొన్ని సందర్భాల్లో నాగ్, అన్నయ్య పై సెట్లోనే అసహనం ప్రదర్శించాడట. నచ్చని సన్నివేశాల్ని మళ్ళీ రీ-షూట్ చేయించాడట.
మొత్తానికి ఓంకార్ అన్నయ్య రాజు గారి గది 2 షూటింగ్ పూర్తి చేసి ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసాడు. వాటికి అభిమానుల నుండి అనుకున్నంత స్పందన రాలేదనే చెప్పొచ్చు. తర్వాత మోషన్ పోస్టర్ పర్లేదు అనిపించినా, ట్రైలర్ మోస్తరుగా కూడా లేకపోవడంతో అందరూ పెదవి విరిచారు. వాస్తవానికి, నాగార్జున ట్రైలర్ లాంచ్ రోజు మొదటి సారి అందరితో కలిసి ట్రైలర్ చూసినపుడు కాస్త అసహనం ప్రదర్శించాడట. ట్రైలర్ ఇలా ఉంటే జనాలు సినిమా చూడటానికి థియేటర్లకు వస్తారా అనే అభిప్రాయం వెలిబుచ్చారట. గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని దర్శక, నిర్మాతలకి సూచించాడట. అంతేనా, మొదటి కాపీ తాను చూసిన తర్వాతే ఫైనల్ చేద్దామని కాస్త గట్టిగానే చెప్పాడట. ఒక విధంగా, రాజు గారి గది 2 కి ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడానికి గల కారణం కూడా హీరోకి, దర్శకుడి మధ్య సరైన సఖ్యత లేకపోవడమే అని ఫిలిం నగర్ బ్యాచ్ గుసగుసలాడుతుంది.