‘బిగ్ బాస్’లో అనవసరపు హంగామా!
on Sep 25, 2017
‘బిగ్ బాస్’ తెలుగు వెర్షన్ నిజంగా సూపర్ హిట్. ఎందుకంటే.. ఈ 70 రోజులూ జనాలు ‘బిగ్ బాస్’ హౌజ్ ని వదల్లేదు. హౌజ్ లోనే ఉండిపోయారు. రిపీట్ గా చూసిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ‘బిగ్ బాస్’ రేటింగే అందుకు నిదర్శనం. గ్రాండ్ ఫినాలే లో విజేతలను ఎంపిక చేసే విషయంలో 11 కోట్లకు పై చిలుకు మెసేజ్ లు జనాల నుంచి వచ్చాయంటే.. ఈ షో ఏ స్థాయి విజయమో అర్థం చేసుకోవచ్చు. అందుకే... ‘గ్రాండ్ ఫినాలే’ చూడ్డం కోసం... టీవీలకు అతుక్కుపోయారు జనాలు. దానికి తగ్గట్టే ఫినాలే గ్రాండ్ గా నిర్వహించినా... కొన్ని అనవసరపు ప్రోగ్రామ్స్ జనాల సహనానికి పరీక్ష పెట్టాయ్.
దేవిశ్రీప్రసాద్ లైవ్ పెర్ ఫార్మెన్స్.. ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలేకి ప్రత్యేక ఆకర్షణ. తన సహజ ధోరణిలో పెర్ ఫాం చేస్తూ... ఆడియన్స్ లో కొత్త ఉత్తేజాన్ని రేకెత్తించాడు డీయస్పీ. ఎన్టీయార్ పాటలతో గ్రాండ్ ఫినాలేని హోరెత్తించాడు. దేవిశ్రీ పెర్ ఫార్మెన్స్ ముగిసే సమయానికి ఎన్టీయార్ కూడా ఎంటరవ్వడంతో ప్రేక్షకులు ఉద్వేగానికి లోనయ్యారు. ఏది ఏమైనా... దేవిశ్రీ పెర్ ఫార్మెన్స్ ఈ ‘బిగ్ బాస్’ హైలెట్స్ లో ఒకటి.
అయితే... వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ అందర్నీ మళ్లీ పిలిపించడం మంచి విషయమే కానీ... వారందరితో పెర్ ఫాం ఇప్పించడం మాత్రం ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. మధుప్రియ, ధన్ రాజ్ ల పెర్ ఫార్మెన్స్... ఉత్కంఠగా విజేత కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ సహనానికి పరీక్షగా తయారైంది. ఒక్కొక్కరికీ ఒక్కో అవార్డు ఇవ్వడం.. వారికి ఓ బిరుదు ఇవ్వడం.. ఇదంతా పోగ్రామ్ ని సాగదీయడానికే అననట్టు అనిపించింది. వ్యాపారధోరణిలో ఆలోచించి... అదనపు రేటింగ్ కోసం ఛానల్ వాళ్లు చేసిన పని ఇది.. అని అందరూ అనుకుంటున్నారు.