ఇక మోహన్ బాబు... విశ్వనటచక్రవర్తి!
on Sep 16, 2017
ఆసక్తికర విశేషాలకు... సావిత్రి బయోపిక్.. ‘మహానటి’ సినిమా.. ఓ నెలవుగా మారింది. ఈ సినిమాపై రోజుకు ఓ ఆసక్తికరమైన న్యూస్ వెలుగు చూస్తోంది. ఇందులో మహానటి సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సావిత్రి భర్తగా.. ప్రముఖ తమిళనటుడు జెమినీ గణేశన్ పాత్రను మలయాళ స్టార్ హీరో దుల్హన్ సల్మాన్ చేస్తున్నాడు.
సావిత్రి ఓ లెజెండ్రీ యాక్ట్రస్. ఆమె సినీ జీవితం ఆద్యంతం... మహనీయుల చుట్టూనే తిరిగింది. ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీయార్, ఎమ్జీయార్, శివాజీగణేశన్, కన్నడ రాజ్ కుమార్... ఈ మహానటులందరూ ఆమె కథలో భాగస్తులే. భానుమతి, అంజలి, జమున లాంటి కథానాయికలు కూడా సావిత్రి జీవితగాధలో పాత్రధారులే. ఇంకా కేవీరెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, మార్కస్ భాట్లే, పింగళి.. ఇలా చాలామంది సినీ వైతాళికులు ఆమె కథలో కనిపిస్తారు. అలాంటి కథకు తెరరూపం ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి గొప్ప సాహసానికే పూనుకున్నాడు దర్శకుడు నాగశ్విన్. రచయిత సాయిమాధవ్ బుర్రాతో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేయించి.. షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.
ఇదిలావుంటే... ఈ సినిమాపై అందిన సమాచారం ప్రకారం... చక్రపాణి పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నాడు. భానుమతి పాత్రలో అనుష్క కనిపించనుంది. ఇక ఎన్టీయార్, ఏఎన్నార్ పాత్రలను జూనియర్ ఎన్టీయార్, నాగచైతన్య లతో చేయించడానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఇక సావిత్రి కథలో కీలకమైన పాత్ర... ఎస్వీ రంగారావుది. ఆయన్ను సావిత్రి.. ‘నాన్నగారూ’ అని పిలిచేవారట. అంతటి అనుబంధం వారిద్దరిదీ. ఈ కథలో.. వారి కాంబినేషన్ సన్నివేశాలు కూడా ఎక్కవేనట.
ఆ పాత్ర విషయంలో ముందు... మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లు వినిపించాయ్. అయితే... అంతటి సామర్థ్యం ఒక్క మోహన్ బాబుకే ఉందని గ్రహించిన చిత్ర యూనిట్.. ఆయన్ను సంప్రదించారు. కలెక్షన్ కింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మోహన్ బాబు రాకతో.. ఈ సినిమాకు ఓ కొత్త వెలుగు వచ్చినట్టయ్యింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి కూడా ధృవీకరించారు. ఇక మిగిలిన మహామహుల పాత్రల్ని ఎవరెవర్ని సెలక్ట్ చేశారో తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే.. ఇందులో సమంతది ఓ జర్నలిస్ట్ పాత్ర. సమకాలీన సమాజానికి అద్దం పట్టేలా ఆ పాత్ర ఉంటుందని తెలిసింది. సావిత్రి కథలో ఈ పాత్ర ఉండదట. ఇప్పటి నేపథ్యంలోనే ఈ పాత్ర సాగుతుందని టాక్. ఈ పాత్రకు జోడీగా దేవరకొండ విజయ్ నటిస్తున్నాడు. అయితే... రీసెంట్ గా తెలిసిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ‘అర్జున్ రెడ్డి’ విజయంతో దేవరకొండకు అనూహ్యంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఈ చిన్న పాత్ర చేయడం కరెక్ట్ కాదేమో.. అని దేవరకొండ... దర్శకునితో అన్నాడని టాక్.
ఇది సావిత్రి కథ. ఇందులో హీరో సావిత్రి మాత్రమే. సో... ఆ రకంగా చూస్తే... ఈ సినిమా నుంచి దేవరకొండను తప్పించాలి. మరి ఇందులో నుంచి దేవరకొండను తప్పిస్తారా? లేక అతని పాత్రను పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అనేది చూడాలి.