బన్నీ... ఏందీ లొల్లీ...?
on Jul 22, 2017
తమిళనాడు వ్యక్తి పూజ ఓ స్థాయిలో ఉంటుంది. దానికి తోడు భాషాభిమానం. ఇక కమల్ హాసన్ లాంటి లెజెండ్ అక్కడుండీ... ఆయన పక్కన పరాయి భాషకు చెందిన వాళ్లు ఉంటే... వారి ఆగడాలకు హద్దుంటుందా?. ప్రతి విషయాన్నీ బూతద్దంలో చూస్తూ... విమర్శలకు లేస్తుంటారు. ఇటీవల అలాంటిదే ఒకటి జరిగింది. ఇంతకీ విమర్శల బారిన పడిన వ్యక్తి ఎవరో కాదు. మన బన్నీనే. పాపం కుర్రాడు... ఏమీ చేయకపోయినా... ఏదో ఒక విషయంలో మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాడు.
ఇంతకీ తమిళ తంబీలు బన్నీపై నిప్పులు చెరగడానికి కారణం ఏంటో తెలుసా? ప్రో కబడ్డీ లీగ్ లో భాగంగా ‘తమిళ్ తలైవా’జట్టును బన్నీ,రామ్ చరణ్ కొనుగోలు చేశారు. బ్రాండ్ అంబాసిడర్ గా కమల్ హాసన్ అడిగారు. ఆయన ఒప్పుకున్నారు. ఈ విషయంపై చెన్నయ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కార్యక్రమానికి కమల్ తో పాటు బన్నీ, చరణ్, సచిన్ టెండూల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్... తదితరులు హాజరయ్యారు. వేదికపై కమల్ కు ఓ పక్క సచిన్ కూర్చుంటే.. మరో పక్క చరణ్, బన్నీ కూర్చున్నారు. అసలు గొడవ ఇక్కడే మొదలైంది. కమల్, సచిన్, రామ్ చరణ్ లు మామూలుగానే ఒద్దికగా వేదికపై కూర్చున్నారు. కానీ మన బన్నీ మాత్రం దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు.
ఇంకేముంది తమిళ తంబీలకు చిర్రెత్తుకొచ్చింది. సాఘిక మాధ్యమంలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ‘సంస్కారం లేదా... పక్కన లెజెండ్ కూర్చుంటే.. ఒద్దికగా కూర్చోవడం చేతకాదా. అప్పుడే కమల్ హాసన్ అంత నటుడు అయిపోయానని
అనుకుంటున్నావా’అంటూ విమర్శలు గుప్పించారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వెంటనే బన్నీ ఫ్యాన్స్ కూడా ఎదురు విమర్శలకు దిగారు. ‘ఇలాంటి వ్యవహారాలు మొగ్గలోనే తుంచేయడం ఎవరికైనా మంచిది.. తెగేదాకా లాగొద్దు’అంటూ విచిత్రంగా స్పందిస్తున్నారు.
బన్నీ... అలా కూర్చోవడంలో వేరే ఉద్దేశ్యం ఉండకపోవచ్చు. అసలు అలా కూర్చోవడం వల్ల గొడవలు జరుగుతాయని బన్నీ ఊహించకపోవచ్చు. కానీ... చివరు సిల్లీ కారణం వల్ల గొడవ జరిగడం నిజంగా బాధాకరమే.
అయితే... బన్నీ మాత్రం ఈ విషయంపై నోరు మెదపకపోవడం గమనార్హం.