ప్రభుత్వాధికారులపై బాహుబలి ఎఫెక్ట్..!
on Apr 27, 2017
బాహుబలి... ది కంక్లూజన్ రిలీజ్కి మరెన్నో గంటల సమయం లేదు. సినిమా ఎలా ఉంటుంది, అందులో పాటలు ఎలా ఉన్నాయి... మాటలెలా ఉన్నాయి... పంచ్ డైలాగుల ప్రభావమెంత..? లాంటి విషయాలతో పనేలేదు. అందరికీ కావాల్సింది... అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. సాక్షాత్తూ దేశ ప్రధానే ఒకానొక సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకువచ్చారంటే బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాహుబలి ఫీవర్... సామాన్యులనే కాదు... ఐఏఎస్లనూ కుదిపేస్తోంది. మొదటి రోజే మొదటి ఆట చూసేందుకు ప్రభుత్వాధికారులు సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఏకంగా వందల్లో టిక్కెట్లు బల్క్ బుకింగ్ చేశారు. హన్మకొండ ఏషియన్ శ్రీదేవి మాల్ థియేటర్ లో 28న ఫస్ట్ షోకు 500 టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా బుక్ చేసిన బాహుబలి టికెట్లను.... వరంగల్ సిటీ బ్యూటిఫికేషన్ కోసం పనిచేసిన అధికారులకు కలెక్టర్ అమ్రపాలి....నజరానాగా ఇచ్చారు. కలెక్టరే 500 టికెట్లు బల్క్ బుకింగ్ చేయించారంటే..... తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
ఇక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి-2 టికెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. ప్రీ-రిలీజ్ బిజినెస్లో సరికొత్త రికార్డు సెట్ చేసిన బాహుబలి.... అడ్వాన్స్ బుకింగ్స్లోనూ అదే జోరు చూపిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్లోనూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. పలు హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి బాహుబలి సత్తా చాటుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సినీ అభిమానులు బాహుబలి ఫీవర్కి చిత్తయిపోతున్నారు. మొదటి రోజు మొదటి ఆట చూసేందుకు నానా తంటాలు పడుతున్నారు. టికెట్ల కోసం థియేటర్ల దగ్గర అష్టకష్టాలు పడుతున్నారు.