బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు
on Nov 11, 2016
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు కుప్పలు కుప్పలుగా పోగవుతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో నల్లధనం విపరీతంగా కూడబెట్టిన వారితో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉన్నవారిలో అలజడి మొదలైంది. పెద్ద మొత్తంలో ఉన్న ధనాన్ని బ్యాంకులో మార్చుకోవాలంటే వారు వణికిపోతున్నారు. ఇలాంటి వారిపై ఆదాయపు పన్ను శాఖ ఒక కన్నేసింది..ఈ నేపథ్యంలో ఎవరిపై..ఎప్పుడు..ఎక్కడ దాడులు మొదలవుతాయోనని బడా బాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
తాజాగా తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి. ప్రాంతీయ భాషా చిత్రమైనప్పటికి వసూళ్లలో బాలీవుడ్ చిత్రాలకు సైతం పోటి ఇచ్చి దుమ్ములేపింది. అధికారిక లెక్కల ప్రకారం బాహుబలి సుమారు రూ.650 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పుడు ఆ కలెక్షన్లే బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు చేసేలా చేసింది. హైదరాబాద్లో నివసిస్తున్న బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వీరిద్దరి బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.