ప్రభాస్ను అవమానించిన టాలీవుడ్..!
on Oct 6, 2016
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ మూవీతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. వర్షం, రాఘవేంద్ర సినిమాలతో లవర్భాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్కి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మాస్ హీరో ఇమేజ్ని తీసుకొచ్చింది. రీసెంట్గా రాజమౌళి-ప్రభాస్ కాంభినేషన్లో వచ్చిన బాహుబలి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. అప్పటిదాకా తెలుగువారికి మాత్రమే పరిచయమైన ప్రభాస్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్ నటనకు గుర్తింపుగా ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు బ్యాంకాక్లో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు జాతిపిత మహాత్మాగాంధీ, నరేంద్రమోడీల తర్వాత అక్కడ స్థానం సంపాదించుకున్న మూడో భారతీయుడిగా, మొదటి భారతీయ సినీనటుడిగా ప్రభాస్ రికార్డుల్లోకి ఎక్కాడు. మామూలుగానే చిన్న చిన్న గుర్తింపు తెచ్చుకున్న వారినే ఆకాశానికేత్తేసే సినీ ప్రముఖులు..ఇంతటి అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ను మాత్రం పట్టించుకోలేదు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇండస్ట్రీ తరపున ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభాస్ను విష్ చేసిన పాపాన పోలేదు. వారి దృష్టిలో ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా లైట్ తీసుకున్నారు టాలీవుడ్ ప్రముఖులు.