సమస్య తీర్చమంటే..భజ్జీలు, బోండాలంటున్నారు
on Aug 19, 2016
ప్రముఖ నటుడు, దక్షిణ భారత సినీ నటుల సంఘం కార్యదర్శి విశాల్ వివాదాలకు కేరాఫ్గా మారాడు. గతంలో నడిగర్ సంఘం కార్యవర్గ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురయ్యాడు. ఆ వెంటనే ఆ కార్యవర్గానికి వ్యతిరేకంగా పోటీ చేసి విజయం సాధించాడు. తాజాగా మరోసారి తమిళ నిర్మాతల మండలిపై విమర్శలు చేసి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. పైరసీపై నిర్మాతల మండలి కఠినంగా వ్యవహరించడం లేదన్నారు.
ఏదైనా సమస్య వచ్చిందని దగ్గరకు వెళ్తే దానిపై చర్చించకుండా బోండాలు, భజ్జీలు తెప్పించుకుని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. మండలి బాగుపడాలంటే ఇప్పుడున్న కార్యవర్గం పోయి కొత్తనీరు రావాలన్నాడు. దీనిపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ కార్యవర్గాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశాడని..వారంలోపు తన విచారాన్ని వ్యక్తం చేయాలని లేని పక్షంలో దీపావళికి విడుదలయ్యే విశాల్ నటిస్తున్న "కత్తిసండై" చిత్రంతో పాటు అతడి సినిమాల విడుదల విషయంలో పంపిణీదారులు సహకరించరని హెచ్చరికలు కూడా జారీ చేసింది.