ఇద్దరమ్మాయిలతో గోపీచంద్!
on Jul 25, 2016
మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మించనున్న యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్ టైనర్ ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. బబ్లీ బ్యూటీ హన్సిక, "సరైనోడు" సినిమాలో గ్లామరస్ ఎమ్మెల్యేగా సూపర్ హిట్ అందుకొన్న కేథరీన్ లు హీరోయిన్లుగా కనువిందు చేయనుంది. గోపీచంద్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి.
అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ సినిమా గురించి నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. "మాస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో సంపత్ నందిది ప్రత్యేకమైన శైలి. అదే విధంగా హీరోయిన్లను తెరపై అందంగా ప్రెజంట్ చేయడంలో ఆయనది అందవేసిన చేయి. "రచ్చ, బెంగాల్ టైగర్" చిత్రాల్లో తమన్నాను అందంగానే కాకుండా రోమాంచితంగానూ చిత్రీకరించిన సంపత్ నంది తాజా చిత్రంలోనూ కేథరీన్, హన్సికలను అదే తరహాలో మరింత అందంగా చూపించనున్నాడు. గోపీచంద్ మాస్ ఇమేజ్ కు ఈ అందాల భామలు తొడవ్వడంతో మాస్ ఆడియన్స్ కు ఈ చిత్రం ఓ విందు భోజనంలా ఉంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అన్నారు.