బాహుబలిని సర్దార్ ఇలాక్కూడా వదల్లేదా..?
on Apr 13, 2016
సర్దార్ గబ్బర్సింగ్ టార్గెట్ ముందు నుంచీ బాహుబలి సినిమానే. ప్రచార వ్యూహాల విషయంలో సర్దార్ టీమ్ బాహుబలినే ఫాలో అయ్యింది. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలన్న ధ్యేయంతోనే.. భారీ ఎత్తున ఈ సినిమాని విడుదల చేశారు. బాలీవుడ్లో బాహుబలి ఇరగదీసిందని.. అక్కడా ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేశారు. అలా అన్నిటా... సర్దార్ బాహుబలిని టార్గెట్ చేశాడు. ఆఖరికి సినిమా డైలాగుల్లోనూ... బాహుబలిని పరోక్షంగా ప్రస్తావించినట్టు.. ప్రభాస్ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సర్దార్లో 'రాజు'లకు సంబంధించిన కొన్ని సంభాషణలు ఉన్నాయి. కాజల్ ది రాజవంశం. ముఖేష్ రుషి పాత్రని 'రాజుగారు' అని సంబోధిస్తుంటాడు పవన్కల్యాణ్. 'యుద్దానికి వెళ్లిన వాడు ప్రతి ఒక్కడూ రాజు కాలేడు.. యుద్ధంలో గెలిచినవాడే రాజు అవుతాడు' అన్న డైలాగ్ కూడా ఈ సినిమాలో వాడారు. యుద్ధం అంటే బాహుబలి అని.. రాజు అంటే ప్రభాస్ అని కొత్త అర్థాలు వెదుక్కొంటున్నారు ప్రభాస్ఫ్యాన్స్.
భీమవరం ఏరియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ. దానికి తోడు పవన్ ఫ్యాన్స్కీ ప్రభాస్ ఫ్యాన్స్ కీ అక్కడ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పవన్ ఫ్లెక్సీలు ప్రభాస్ఫ్యాన్స్ పీకేశారని ఓసారి, ప్రభాస్ పోస్టర్లను పవన్ ఫ్యాన్స్ తగలబెట్టారని మరోసారి వారిద్దరి మధ్య గొడవలు రాజుకొన్నాయి. రాజు - కాపు మధ్య ఓ రకమైన యుద్దవాతావరణం నెలకొంది. ఈ సినిమాలోనూ రాజు - కాపు కులాల ప్రస్తావన తీసుకురావడంతో మళ్లీ భీమవరంలో ఈ రెండు వర్గాల మధ్య వేడి రాజుకొంది. పవన్ అండ్ కో ఈ డైలాగ్ని ఉద్దేశ పూర్వకంగా వాడి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సెన్సిటీవ్ విషయాల్ని మరింత సెన్సిటీవ్గా ఆలోచించి డీల్ చేయాల్సింది. కానీ.. ఇప్పటికే లేట్ అయిపోయింది. భీమవరం మళ్లీ రాజుకొంటోంది. మరి.. ఈ మంటలను ఆర్పేదెవరు?? సినిమాని సినిమాగా చూస్తే ఎవ్వరికీ ఏ గొడవా ఉండదు. ఈ విషయంలో ఆలోచించాల్సింది అభిమానులే.