బాలీవుడ్ లో తండ్రైన అరవింద్ స్వామి..!
on Apr 2, 2016
రోజా సినిమాతో అరవింద్ స్వామి అనే హ్యాండ్సమ్ హీరో ఎంతో మంది మగువల మనసుల్ని కొల్లగొట్టాడు. దళపతితో సినీరంగానికి పరిచయమై రోజా, బొంబాయి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు అరవింద్. 2001 తర్వాత సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుని, వ్యాపారాల్లో తలమునకలైపోయాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత 2013లో కడలితో సినిమాల్లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం తనీ ఒరువన్ ఇచ్చిన బ్రేక్ తో అన్ని పాత్రలకూ సై అంటున్నాడు అరవింద్ స్వామి.
ఆ సినిమా తెలుగు రీమేక్ లో రామ్ చరణ్ కు సరసన విలన్ గా నటిస్తూనే మరో బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడు. ఆల్రెడీ గతంలో రెండు బాలీవుడ్ సినిమాలు చేసిన అరవింద్ కు అక్కడ రోజా తో కూడా మంచి పేరు వచ్చింది. డియర్ డాడ్ అన్న టైటిల్ తో త్వరలోనే రాబోతున్న బాలీవుడ్ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ప్రధానాంశంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల కొడుకు, 45 ఏళ్ల తండ్రి కలిసి చేసిన ప్రయాణమే డియర్ డాడ్ కథ. తండ్రి పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. హీరో నుంచి క్యారెక్టర్, విలన్ రోల్స్ కు మారిన అరవింద్ ప్రస్థానం ఎలా సాగుతుందో చూడాలి మరి.