’సైరా‘ విషయంలో మెగా శ్రద్ధ!
on Jan 27, 2018
‘సైరా’ సినిమా విషయంలో చిరంజీవి చూపిస్తున్న శ్రద్ధ నిజంగా నేటి హీరోలకు కూడా ఆదర్శమే. తొలి షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ నుంచి టాకీ పార్ట్ మొదలవుతుదనమాట. ఈ సినిమా సంభాషణలను సాయిమాధవ్ బుర్రా అందిస్తున్న విషయం తెలిసిందే. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సాయిమాధవ్ అందించిన మాటలు డైనమేట్లలా పేలి.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయ్. అందుకే.. హిస్టారికల్ మూవీగానే తెరకెక్కుతున్న ‘సైరా’ కు కూడా సాయిమాధవ్ తోనే సంభాషణలు రాయించాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. త్వరలో టాకీ పార్ట్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా... సాయిమాధవ్ తో దగ్గరుండి మెగాస్టార్ డైలాగులు రాయించుకుంటున్నారనేది యూనిట్ వర్గాల భోగట్టా.
స్ర్రిప్ట్ వర్క్ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనీ... ప్రతి సీన్ పేపర్ నీ షూటింగ్ కి ముందే అధ్యయనం చేస్తున్నాడనీ... ప్రతి సన్నివేశాన్నీ శిఖరాగ్రాన నిలిపే స్థాయిలో సంభాషణలను దగ్గరుండి రాయించుకుంటున్నారనీ విశ్వసనీయ సమాచారం. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో సాయి రాసిన డైలాగులు.. బాలయ్య చెబుతుంటే.. అభిమానులు ఆనందపరవశులయ్యారు. రేపు ‘సైరా నరసింహారెడ్డి’ కోసం సాయి రాస్తున్న డైలాగులు... మెగాస్టార్ చెబుతుంటే... అభిమానులు ఆనందంతో గంతులేయడం ఖాయం. ఏమంటారు? ‘సైరా’ సంక్రాంతికి రావచ్చిన వినికిడి.