సాయి పల్లవి సగం డబ్బులే తీసుకుందట!
on Jan 8, 2019
వెండితెరపై సాయి పల్లవి నటనకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయ్యారు. వెండితెర వెనుక ఆమె మంచి మనసు తెలిస్తే సాయి పల్లవి వ్యక్తిత్వానికీ ఫిదా కావడం ఖాయమే. అసలు వివరాల్లోకి వెళితే... సాయి పల్లవి కథానాయికగా నటించిన తాజా తెలుగు సినిమా 'పడి పడి లేచె మనసు'. శర్వానంద్ కథానాయకుడిగా 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమా విడుదలకు ముందు సాయి పల్లవికి ఆయన ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలేదు. 'పడి పడి లేచె మనసు'కు సాయి పల్లవికి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. విడుదలకు ముందు 60 లక్షలు మాత్రమే ఇచ్చారట. విడుదల తరవాత మిగతా 40 లక్షలు ఇవ్వడానికి వెళ్లగా... ఆ డబ్బును తీసుకోవడానికి సాయి పల్లవి నిరాకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినిమా డిజాస్టర్ అయ్యింది కనుక.. నిర్మాతకు నష్టాలు వచ్చాయి కనుక.. తాను డబ్బులు తీసుకోవడం సమంజసం కాదని సాయి పల్లవి భావించారట. ఆమె తల్లిదండ్రులు కూడా కుమార్తె నిర్ణయానికి మద్దతు ఇచ్చారని తెలిసింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మాతల ముక్కుపిండి మరీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీనటులు, హీరో హీరోయిన్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయి పల్లవి తీసుకున్న నిర్ణయానికి పరిశ్రమలో ప్రశంసలు లభిస్తున్నాయి.