బెల్లంకొండ ‘మహాసముద్రం’!
on Feb 5, 2019
‘ఆర్ఎక్స్ 100’ విజయం తర్వాత చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ దర్శకుడు అజయ్ భూపతి పేరు విపరీతంగా వినిపించింది. ఆయన ఫలానా కథానాయకుడితో సినిమా చేస్తారంటూ కృష్ణానగర్లో కబుర్లు వినిపించాయి. అజయ్ భూపతి మాత్రం కథ సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు కథ సిద్ధమైంది. ఆ కథతో చేయబోయే చిత్రానికి దర్శకుడు ఓ పేరు కూడా ఖరారు చేశారని తెలిసింది. ‘మహాసముద్రం’ టైటిల్తో అజయ్ భూపతి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇదొక మల్టీస్టారర్ సినిమా. ఇందులో ఓ కథానాయకుడిగా నటించేందుకు బెల్లకొండ సాయిశ్రీనివాస్ అంగీకరించినట్టు సమాచారం. మరో కథానాయకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిత్రబృందం అతడి అన్వేషణలో ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘సీత’ చిత్రంలో నటిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత అజయ్ భూపతి సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. భారీ తారాగణంతో, ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.