రీలుపై రియలు నగల అవసరం..
on Jul 22, 2014
రుద్రమదేవి చిత్ర షూటింగ్ లో నగలు మాయమవటం, అసలు ఆ నగలు బంగారు నగలు అవునా కాదా అనే విషయంలో అనుమానాలు తలెత్తటం, నగలు ఎలా మాయమయ్యాయో అనే విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి క్లూ దొరకకపోవటం ఈ మిస్టరీ గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరో వైపు సినిమాల్లో బంగారు నగలు వాడటం గురించిన అంశాలు గురించి ఆసక్తికర కథనాలున్నాయి.
కృష్ణవంశీ చిత్రం అంతఃపురం చిత్రంలో సౌందర్య ఏడువారాల నగలు అలకరించుకొని ఒక సీన్లో కనిపిస్తుంది. ఈ సీన్ కోసం కృష్ణవంశీ పూర్తి బంగారు నగలే వాడారు. నిజమైన నగలు ధరించడం వల్ల వచ్చే ఎక్స్ప్రెషన్ కూడా రియల్ గా, ఎఫెక్టివ్గా వుంటుందని ఆయన నమ్మకం.
అలాగే జోధా అక్బర్ చిత్రంలో ఐశ్వర్య ధరించినవి కూడా బంగారు నగలే. జోధా అక్బర్ చిత్రానికి నగలు, దుస్తులు రూపొందించిన నీతా లుల్లా రుద్రమదేవి చిత్రానికి కూడా నగలు డిజైన్ చేశారు. బంగారు నగలు అదనపు హుందాతనాన్ని, రిచ్నెస్ని జోడిస్తుందని దర్శకులు నమ్ముతున్నారు. అందుకే ఒరిజినల్ నగలు కావాలని డిజైనర్లతో రూపొందించుకుంటున్నారు. సినిమా పబ్లిసిటీలో కూడా ఒరిజినల్ నగల హవా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత, సినిమాలో వాడిన నగలు, దుస్తులు ఆక్షన్ నిర్వహించే పద్ధతి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అదీ లాభదాయకం మాత్రమే కాదు, విడుదల అనంతరం చక్కటి పబ్లిసిటీగా కూడా పనిచేస్తుంది.
ఇలా తెర మీదే కాక, ప్రచార విషయంలోనూ ఎంతో ప్రాముఖ్యత వున్న ఈ రియలు దుస్తులు, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అలా కాకుండా అవి దొంగతనానికి గురైనప్పుడు పోలీసుల దగ్గరికి పరిగెత్తడం, లబోదిబోమనడం ఇమ్మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. బంగారు నగలు అందంతో పాటు అడిష్నల్ బాధ్యతను కూడా పెంచుతుందనే విషయాన్ని ఫిలిం మేకర్స్ దృష్టికి రాని విషయంగా భావించడానికి వీలులేదు.
అసలు ఏవి గిల్టు నగలో, ఏవి బంగారు నగలో, అసలు ఎన్ని నగలు షూటింగ్ నిమిత్తం వాడుతున్నారో లాంటి మినిమమ్ సమాచారం కూడా లభ్యం కాకపోవడం మరింత ఆశ్యర్యంగా అనిపిస్తుంది. రీలు మీద రియలుగా కనిపించాలని, ఖరీదైన దుస్తులు, నగలు వాడుతున్నప్పుడు వాటి రక్షణ విషయంలో పర్యవేక్షణ లోపించిందని రుద్రమదేవి నగల వ్యవహారం చూస్తే అనిపించకమానదు.