ఆర్ఎక్స్ 100 హీరోతో ఈసారీ కొత్తమ్మాయే!
on Jan 18, 2019
కథానాయకుడిగా కార్తికేయకు విజయాన్ని, ప్రేక్షకుల్లో గుర్తింపుని ఇచ్చిన సినిమా 'ఆర్ఎక్స్ 100'. అందులో పాయల్ రాజ్పుత్ కథానాయిక. అంతకు ముందు ఆమె పంజాబీ సినిమాల్లో నటించినా... తెలుగు తెరకు కొత్త ముఖమే. 'ఆర్ ఎక్స్ 100'తో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా తరవాత కార్తికేయ 'హిప్పీ' అని ఓ సినిమా చేస్తున్నారు. అది కాకుండా బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలోనూ కథానాయికగా కొత్తమ్మాయిని తీసుకున్నారు. అంటే... తెలుగు తెరకు కొత్త ముఖమే. తమిళంలో ఓ సినిమా చేసిన మలయాళీ భామ అనఘా మారుతోరాను కార్తికేయకు జోడీగా ఎంపిక చేశారని తెలిసింది. కథ ప్రకారం కార్తికేయ పక్కన కొత్తమ్మాయి అయితే బావుంటుందని దర్శకుడు ఈమెను ఎంపిక చేశారట. ఈ సినిమా షూటింగు గురువారం ఒంగులులో ప్రారంభమైంది.