వరుణ్తేజ్ రెండు లైన్లకు ‘యస్’ చెప్పాడట!
on Dec 14, 2018
‘ఘాజీ’ తరవాత సంకల్ప్రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ‘అంతరిక్షం’. మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోగా నటించారు. అతను సినిమాలో నటించడానికి అంగీకరించడం వల్లే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిందని చిత్ర సమర్పకుడు, దర్శకుడు క్రిష్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తెలిపారు. అదే కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ సైతం కథల ఎంపికలో వరుణ్తేజ్ జడ్జ్మెంట్ని కొనియాడారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ వంటి హీరోలకు నటనతో పాటు కథల ఎంపికలో మంచి జడ్జ్మెంట్తో ఉండటం వల్లే సూపర్స్టార్లు అయ్యారనీ, వరుణ్తేజ్ కూడా వాళ్లలా సూపర్స్టార్ అవుతారని సుకుమార్ అన్నారు. అసలు, వరుణ్తేజ్ ఈ సినిమా కథలో ఏం నచ్చి ఓకే చెప్పారో తెలుసా? జస్ట్... రెండంటే రెండే లైన్లు, ఒక ఫొటో. దర్శకుడు సంకల్ప్రెడ్డి మాట్లాడుతూ ‘‘ఘాజీ’ విడుదలైన మూడు నెలలకు పేపర్లో ఒక అర్టికల్ చదివా. దాన్ని చూసి స్ఫూర్తితో కథ అనుకున్నా. వరుణ్తేజ్కి ఒక ఫొటో చూపించి... రెండు లైన్లు చెప్పాను. ఆయన సినిమా చేయడానికి అంగీకరించారు’’ అన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేయాలని అనుకుంటున్నట్టు సంకల్ప్రెడ్డి తెలిపారు. ‘తదుపరి సినిమా ఏంటి?’ అని ఆయన్ను అడగ్గా... ‘‘బాలీవుడ్లో రెండు అవకాశాలు ఉన్నాయి. అక్కడ సినిమా చేయాలనుకుంటున్నా. ఒకవేళ బాలీవుడ్లో సినిమా చేస్తే... ఎక్కువ సమయం పడుతుంది. మరీ ఆలస్యం అయితే తెలుగులో సినిమా చేస్తా. ‘అంతరిక్షం–2’ చేయాలని నా ఆలోచన’’ అన్నారు.