ఒకవైపు పాలిటిక్స్, ఇంకోవైపు మూవీస్.. పవర్స్టార్ కార్యాచరణ!
on Nov 5, 2019
రెండేళ్ల విరామంతో మళ్లీ సినిమాలు చెయ్యాలని నిశ్చయించుకున్న పవన్ కల్యాణ్.. రాజకీయాలను ఒదిలేది లేదని విశాఖపట్నంలో నవంబర్ 3న నిర్వహించిన లాంగ్ మార్చ్ ద్వారా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత కారణంగా పనులు నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై చలించిన పవన్ కల్యాణ్.. లాంగ్ మార్చ్ నిర్వహించారు. దీనికి లభించిన స్పందనతో మరింత ఉత్సాహంగా, ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వంతో మరింత దృఢంగా పోరాడాలని ఆయన సంకల్పించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయన లాంగ్ మార్చ్ తరహాలో మరో కార్యక్రమాన్ని చేపడతారని ఆ వర్గాలు అంటున్నాయి.
అలాగే తనకు ప్రజాభిమానాన్ని సాధించిపెట్టిన సినిమాలను వదులుకోకూడదని కూడా పవన్ భావిస్తున్నారు. అయితే కేవలం కమర్షియల్ విలువలున్న స్టోరీలతో కాకుండా, అవి మేళవించిన సామాజిక ప్రయోజన కథలతో సినిమాలు చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే హిందీ హిట్ ఫిల్మ్ 'పింక్' తెలుగు రీమేక్లో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ కేరెక్టర్ను ఆయన చేయనున్నారు. అంటే ఈ సినిమాలో ఆయనకు హీరోయిన్, డ్యూయెట్లు ఉండవు. భీకరమైన యాక్షన్ ఎపిసోడ్లూ చేయరు.
కామాంధులైన ముగ్గురు యువకుల చేతుల్లో అన్యాయానికి గురైన ముగ్గురు యువతులకు అండగా నిలిచి, కోర్టులో వారికి న్యాయం జరిగేలా పోరాడే ఒక ధైర్యవంతుడైన సీనియర్ లాయర్గా ఆయన నటించబోతున్నారు. ఇంకో విశేషమేమంటే 48 ఏళ్ల పవన్ కల్యాణ్, తన వయసుకు తగ్గట్లు మధ్యవయసు వ్యక్తిగానే ఈ సినిమాలో కనిపిస్తారు. కోర్టు సన్నివేశాలు ఎక్కువగా ఉండే ఈ సినిమాలో లాయర్గా కోర్టులో పవన్ వాదించే సన్నివేశాలు సినిమాకు కీలకం కానున్నాయి. 'పింక్' మూవీలో అమితాబ్ చేసిన ఈ సీన్లకు వచ్చిన రెస్పాన్స్ సూపర్బ్ అని చెప్పాలి. అలాగే ముగ్గురు యువతుల్లో ప్రధానమైన పాత్రలో తాప్సీ ప్రదర్శించిన అభినయం కూడా 'పింక్' ఘన విజయానికి దోహదం చేసింది.
తెలుగులో ఆ పాత్రను ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డేను ఆ కేరెక్టర్కు సంప్రదిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇప్పటివరకూ గ్లామరస్ రోల్స్లోనే కనిపించిన పూజా ఈ కేరెక్టర్ను అంగీకరిస్తే, ఇది ఆమె కెరీర్కు ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చే కేరెక్టర్ అవుతుంది. ఈ సినిమా తమిళ రీమేక్ 'నేర్కొండ పార్వై'లో ఆ పాత్రను పోషించిన శ్రద్ధా శ్రీనాథ్ సైతం ప్రేక్షకుల అభిమానాన్ని బాగా పొందింది. అదే మూవీలో లాయర్గా మెయిన్ రోల్ చేసిన అజిత్ సైతం ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ఆదరాన్ని బాగా పొందాడు. ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ను ఆ కేరెక్టర్లో ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోననే అనుమానాలు ఆ మూవీ సక్సెస్తో పటాపంచలయ్యాయి.
ఇప్పుడు పవన్ కల్యాణ్తో అదే కేరెక్టర్ను చేయించాలని నిర్మాతలు సంకల్పించారు. తమిళంలో ఆ మూవీని ప్రొడ్యూస్ చేసిన బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి తెలుగు రీమేక్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ను ఈ పాత్ర చేయించడంలో దిల్ రాజు సఫలమయ్యారు. అయితే నిన్నటివరకూ అసలు సీన్లో లేని డైరెక్టర్ పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. ఆ డైరెక్టర్ వేణు శ్రీరాం. దిల్ రాజు బేనర్లోనే వేణు శ్రీరాం రెండు సినిమాలు డైరెక్ట్ చేశాడు. సిద్ధార్థ్తో చేసిన 'ఓ మై ఫ్రెండ్' ఫ్లాప్ కాగా, నాని హీరోగా చేసిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సూపర్ హిట్టయింది. ఇప్పుడు దిల్ రాజు బేనర్లోనే చేయబోతున్న మూడో సినిమాలో ఏకంగా పవర్ స్టార్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వేణు.
ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలను చెయ్యడానికి పవన్ అంగీకరించారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. వాటిలో ఒకటి క్రిష్ డైరెక్షన్లో, మరొకటి హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఉంటాయి. ఈ మూడింటిలో రెండు సినిమాలు 2020లో, ఒకటి 2021లో విడుదల అవుతాయి. ఈ సినిమాలు చేస్తూనే, సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడేందుకు జనసైనికులకు దిశా నిర్దేశం చెయ్యడానికి పవన్ కల్యాణ్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.