నవాబ్ సినిమా రివ్యూ
on Sep 28, 2018
నటీనటులు: ప్రకాశ్రాజ్, జయసుధ, అరవింద్ స్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరి, శింబు, డయాన, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్ తదితరులు
కెమెరా: సంతోష్ శివన్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాణ సంస్థలు: మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్
సమర్పణ: అశోక్ వల్లభనేని
నిర్మాతలు: మణిరత్నం, సుభాష్ కరణ్
దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: 27/09/2018
వయసు పెరుగుతోన్న కొలదీ మణిరత్నంలో ప్రతిభ మసకబారుతోందా? ఇకపై ఆణిముత్యాల అనదగ్గ చిత్రాలను ఆయన తీయలేరా? 'చెలియా', 'కడలి' సినిమాలు చూశాక... ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు. ఈ నేపథ్యంలో ఆయన భారీ మల్టీస్టారర్ అనౌన్స్ చేశారు. 'యువ', 'దళపతి'... గతంలో ఆయన దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ సినిమాలు చూస్తే మణిరత్నానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆశ. ఇటీవల సినిమాలు గుర్తు చేసుకుంటే మనసులో ఓ మూలన చిన్న భయం. ప్రేక్షకుల్లో ఎన్నో ఆలోచనల మధ్య విడుదలైన 'నవాబ్' ఎలా వుంది? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ:
భూపతిరెడ్డి (ప్రకాశ్రాజ్)... చెన్నై నగరంలో పేరుమోసిన మాఫియా డాన్. సతీమణితో కలిసి ఒక రోజు గుడికి వెళ్లి వస్తుండగా.. భూపతిరెడ్డిపై పోలీసులు ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తారు. కాని వర్కవుట్ కాదు. భూపతిరెడ్డి ప్రాణాలతో సురక్షితంగా బయటపడతాడు. అయితే.. ఎన్కౌంటర్ చేసింది ఫేక్ పోలీసులు అని తెలుస్తుంది. భూపతిరెడ్డిపై ఎటాక్ చేసిందెవరు? అని ఆయన ముగ్గురు కొడుకులు వరద (అరవింద్ స్వామి), దుబాయ్ నుంచి వచ్చిన త్యాగు (అరుణ్ విజయ్), సెర్బియా నుంచి రుద్ర (శింబు) తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎటాక్ చేశారో తెలియకముందు ముగ్గురు కొడుకుల్లో భూపతిరెడ్డి వారసుడు ఎవరు? అనే ప్రశ్న మొదలవుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క ముందు భూపతిరెడ్డి మరణిస్తాడు. తరవాత అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు మొదలవుతుంది. అన్నదమ్ముల ఆధిపత్యపోరులో ఎవరు గెలిచారు? అసలు భూపతిరెడ్డి మీద ఎటాక్ చేసింది ఎవరు? మధ్యలో డ్యూటీ నుంచి సస్పెండ్ అయిన రసూల్ (విజయ్ సేతుపతి) పాత్ర ఏమిటి? అనేది సినిమా.
విశ్లేషణ:
మణిరత్నం మార్క్ మాఫియా, గ్యాంగ్స్టర్ మూవీ 'నవాబ్'. ఎట్ ద సేమ్ టైమ్.. థ్రిల్లర్ మూవీ. సినిమా స్టార్టింగులో స్ట్రయిట్గా పాయింట్లోకి వెళ్ళాడు మణిరత్నం. అక్కడ మొదలు ఇంటర్వెల్ వచ్చేవరకూ బిగి సడలని కథనంతో, ఒక సన్నివేశంతో మరో సన్నివేశానికి ముడి పెడుతూ సినిమాను నడిపించాడు. ఇంటర్వెల్ తరవాత కథలో ఆ వేగం తగ్గింది. మణిరత్నం మార్క్ మిస్ అయ్యింది. కాని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే చాలా మెరుగు అనిపిస్తుంది. దర్శకుడికి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ నుంచి పూర్తి సహకారం లభించింది. ప్రతి సన్నివేశాన్ని అతడు కెమెరాలో బంధించిన తీరు ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో శ్రీకర్ ప్రసాద్ షార్ప్ ఎడిటింగ్ ప్లస్ అయ్యింది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ప్రతి పాట సన్నివేశానికి తగ్గట్టు నేపథ్యంలోనో, సందర్భానుసారంగానో వచ్చింది. అయితే... మణిరత్నం నుంచి ఆశించే మార్క్ రొమాంటిక్ సీన్స్ సినిమాలో లేవు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను సాదాసీదాగా తీశారు. మణిరత్నం నుంచి ప్రేక్షకులు అంతకు మించి ఆశిస్తున్నారు. అందువల్ల ఆయన అభిమానులు కాస్త నిరుత్సహా పడక తప్పదు.
నటీనటులు పనితీరు:
ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. సినిమాలో ప్రతి పాత్రధారి అత్యుత్తమ నటన కనబరిచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వైఫలమై వుండొచ్చు. కాని నటీనటుల నుంచి చక్కటి నటన రాబట్టుకోవడంలో మణిరత్నం ఎప్పుడూ విఫలం కాలేదు. 'నవాబ్'లోనూ ప్రతి ఒక్కటి చేత వారెవ్వా అనిపించేలా చేయించుకున్నారు. ముఖ్యంగా శింబు నటన ఈలలు, చప్పట్లు కొట్టిస్తుంది. రసూల్ పాత్రలో విజయ్ సేతుపతి నవ్వించాడు. ప్రేక్షకులకు కథలో ట్విస్టులు ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్ పాత్రలకు తగ్గట్టు బాగా చేశారు. జ్యోతిక, జయసుధ సహజ నటనతో ఆకట్టుకున్నారు. తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ ఆకట్టుకుంది. అదితిరావు, డయాన పాత్రల నిడివి తక్కువ అయినప్పటికీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
చివరగా:
కథకుడిగా మణిరత్నం మరోసారి మెరిశారు. దర్శకుడిగా కొన్ని సందర్భాల్లో వెనుక సీటులోకి వెళ్లినప్పటికీ.. కథకుడు సినిమాను ఆసక్తిగా మార్చాడు. చివరి వరకూ విలన్ ఎవరు? భూపతిరెడ్డి మీద ఎటాక్ చేసిందెవరు? అనేది తెలియకపోవడం సినిమాను ఆసక్తికరంగా మార్చింది. క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. మణిరత్నం ప్రతిభకు తోడు సంతోష్ శివన్, ఏఆర్ రెహమాన్ తోడు కావడంతో సినిమా ఉన్నత ప్రమాణాలతో సాగింది.
రేటింగ్: 2.75