రామ్చరణ్ చిత్రానికి అన్యాయం జరిగిందా?
on Aug 10, 2019
ఉత్తమ తెలుగు చిత్రంగా సావిత్రి బయోపిక్ 'మహానటి'కి నేషనల్ అవార్డు, అందులో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ కు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు, ఆ సినిమాకు కాస్ట్యూమ్స్ కేటగిరీలోనూ అవార్డు... అలాగే, ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమైన 'అ!'కు విజువల్స్ ఎఫెక్ట్స్, మేకప్ కేటగిరీల్లోనూ అవార్డులు... ఇక, 'చిలసౌ'కు గాను రాహుల్ రవీంద్రన్ కు ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో, 'రంగస్థలం'కి గాను ఆడియోగ్రఫీలో అవార్డులు వచ్చాయి. మొత్తం మీద 66వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు మొత్తం మీద ఏడు అవార్డులు వచ్చాయి. దీంతో తెలుగు సినిమా ప్రముఖులు, అభిమానులు సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో కాస్త అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' చిత్రానికి అన్యాయం జరిగిందనే అభిప్ర్రాయం కొందరిలో ఏర్పడింది.
వినికిడి లోపం ఉన్న యువకుడిగా 'రంగస్థలం'లో రామ్ చరణ్ అద్వితీయ నటన కనబరిచారు. దర్శకుడిగా సుకుమార్, సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, కళా దర్శకులుగా మౌనిక, రామకృష్ణ పనితనానికి మంచి పేరు వచ్చింది. 80వ దశకంలో గోదావరి పల్లె వాతావరణాన్ని తెరపై కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. వసూళ్ల వర్షం కురిసింది. మెగా అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తాయని ఆశించారు. కానీ, ఒక్కటంటే ఒక్క అవార్డు మాత్రమే వచ్చింది.
'అంధాధున్'లో ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటించారు. 'ఉరి'లో విక్కీ కౌశల్ ఆర్మీ మేజర్ గా నటించారు. వీరిద్దరినీ 2018కి గాను ఉత్తమ నటులుగా అవార్డుల కమిటీ గుర్తించింది. వారి నటనకు ఏమాత్రం తీసిపోని రీతిలో రామ్ చరణ్ నటించాడని, అతనికి అవార్డు రాకపోవడం విస్మయం కలిగించిందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. 'రంగస్థలం'తో పాటు శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన 'నీదీ నాదీ ఓకే కథ' కూడా అవార్డుల్లో మిగతా చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చాయని సమాచారం. ఈ రెండు చిత్రాలకు అన్యాయం జరిగిందని కొందరు తెలుగు సినిమా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.