బెల్లంకొండ-తేజ సినిమాలో ప్రియాంక చోప్రా కజిన్!
on Sep 8, 2018
పేరుకి ప్రముఖ హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్. కానీ, అమ్మాయి ఖాతాలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. బార్బీ హండా నుంచి మన్నారా చోప్రాగా పేరు మార్చుకున్నా... అదృష్టం కలిసి రాలేదు ఈ అందాల భామకు. నాలుగు సంవత్సరాల క్రితం 'ప్రేమ గీమా జాన్తా నయ్' (2014లో) సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యింది. తరవాత అదే యేడాది హిందీలో 'జిద్' అనే సినిమా చేసింది. రెండూ ప్లాప్ సినిమాలే! మరో ఛాన్స్ రావడానికి మన్నారాకు రెండేళ్లు పట్టింది. రెండేళ్ల క్రితం తెలుగులో రెండు సినిమాలు చేసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'తిక్క'లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా, సునీల్ హీరోగా నటించిన 'జక్కన్న'లో సోలో హీరోయిన్గా నటించింది. ఈ రెండూ కూడా ఆమె రాత మార్చలేదు. తరవాత దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఆమె రాత మార్చలేకపోయాడు. ఆయన దర్శకత్వంలో మన్నారా చోప్రా హీరోయిన్గా నటించిన 'రోగ్' ప్లాప్. ఓ రకంగా మన్నారా చోప్రా కెరీర్ క్లోజ్ అయ్యిందనుకుంటున్న సమయంలో దర్శకుడు తేజ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది కదా! బెల్లంకొండ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఆ సినిమాలో మరో హీరోయిన్కి ఛాన్స్ వుంది. ఆ సెకండ్ హీరోయిన్ రోల్కి మన్నారా చోప్రాని ఎంపిక చేశారు. కొన్ని రోజులు ఆమె షూటింగులో కూడా పాల్గొన్నారు. మన్నారా చోప్రాలో ఎంతో ప్రతిభ దాగుందని, పాత్రకు ఆమె న్యాయం చేస్తుందని దర్శకుడు తేజ పేర్కొన్నారు.