మరో తమిళ చిత్రంలో మల్లికా షెరావత్
on Feb 27, 2021
`మర్డర్` (2004) చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి మల్లికా షెరావత్. ఓ వర్గం ప్రేక్షకులకు `హాట్` ఫేవరేట్ అయిన మల్లిక.. ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే నటించినా అప్పుడప్పుడు తమిళ చిత్రాల్లోనూ మెరిసింది. లోకనాయకుడు కమల్ హాసన్ `దశావతారం` (2008)తో పాటు శింబు `ఓస్తీ` (`దబాంగ్` రీమేక్) (2011)లోనూ అలరించింది. `దశావతారం`లో కీలక పాత్రలో నటించిన మల్లిక.. `ఓస్తీ`లో ప్రత్యేక గీతంలో తళుక్కుమంది.
కట్ చేస్తే.. పదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మల్లిక మరోమారు తమిళ సినిమాలో నటించబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. `పాంబాట్టం` పేరుతో వీసీ వడివుడయాన్ ఓ హారర్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. జీవన్, రితికా సేన్, యాషికా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇళవరసి నాగమతి అనే పాత్రలో మల్లిక దర్శనమివ్వనుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ లో మల్లికా షెరావత్ జాయిన్ కానుందని సమాచారం. కాగా, ఈ చిత్రం ప్రధానంగా తమిళంలో తెరకెక్కినా మల్లికకు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారట. మరి.. మల్లికకు ఈ హారర్ థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.