అప్పుడు తాత..ఇప్పుడు మనవడు!
on Nov 10, 2017
తారక రాముడు...భద్రాద్రి రాముడ్ని కలవనున్నాడు. అదేంటి? కన్ఫ్యూషన్ గా ఉందా? ఏమీ లేదండీ.. మన జూనియర్ ఎన్టీయార్... శుక్రవారం భద్రాద్రి రాములవారిని దర్శించుకోనున్నాడు. కొరటాల శివ సహితంగా.. సతీ సమేతంగా జూనియర్ రాములవారిని శుక్రవారం 9 గం.లకు దర్శించుకోనున్నాడు.. ఆ తర్వాత తన అభిమాన సంఘాల నాయకుడు తాళ్లూరి రమేశ్ నివాసానికి వెళ్లి అల్పాహారం తీసుకుంటారు. ఇదనమాట షెడ్యూల్. ఉన్నట్టుండి తారక రాముడికి... భద్రాచల రామయ్య పై మనసైందేంటా! అనుకుంటున్నారా? తన సినిమా మొదలైనా... హిట్ అయినా.. భద్రాద్రి రామయ్యను కలవడం కొరటాల శివ సెంటిమెంట్. అందుకే... ఆయన భద్రాద్రి చేరుకున్నాడు. ఆయనతో పాటు సరదాగా జూనియర్ ఫ్యామిలీ కూడా చేరుకుంది. అదనమాట విషయం.
గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీయార్ కూడా కుటుంబ సమేతంగా భద్రాద్రిలో పూజలు నిర్వహించారు. 60 ఏళ్లకు ఓ మారు వచ్చే మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంలో ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా అన్న నందమూరి తారకరామారావు పాల్గొన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే పేరు పెట్టుకున్న ఆయన మనవడు రామయ్యను దర్శించుకోవడం విశేషం. రాముడంటే... తెలుగు ప్రజలకు కనిపించే రూపం ఎన్టీయార్ దే. లవకుశ, శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీ రామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ సత్య చిత్రాల్లో ఎన్టీయార్ రాముడిగా కనిపించి తెలుగు ప్రజలను భక్తిపారవశ్యంలో ముంచెత్తారు.
ఆయన మనవడు జూనియర్ కూడా మల్లెమాల తీసిన పిల్లల ‘రామాయణం’ చిత్రంలో రాముడిగా నటించి పసి వయసులోనే మెప్పించాడు. రామయ్య అందరికీ దేవుడే అయినా.. తారక రాముడి కుటుంబానికి ఈ విధంగా కూడా ఆయనపై ఎఫెక్షన్ ఎక్కువ. ఇప్పుడు జూనియర్ భద్రాచల ఆగమనం ప్రత్యేకతను సంతరించుకోడానికి కారణం అదే. ఎన్టీయార్ తనయుడు బాలయ్య కూడా పలు సందర్భాల్లో భద్రాద్రి రామయ్యను దర్శనం చేసుకున్నారు.