‘జై సింహ’ అసలు కథ ఇది!
on Dec 27, 2017
బాలయ్య ‘జై సింహా’ కథ ఇదే.. అంటూ గతంలో ఓ కథ ఫిలింసర్కిల్స్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బాలయ్య ఇందులో భగ్న ప్రేమికునిగా నటిస్తున్నాడనీ... బాలయ్య, నయన ప్రేమించుకున్నా... నయన పెళ్లి మాత్రం కిక్ శ్యామ్ తో జరుగుతుందనీ... ఆ బాధతోనే పెళ్లికి దూరంగా బాలయ్య బతుకుతుంటాడనీ.. ఆ తర్వాత బాలయ్య జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుందనీ... ప్రమాదంలో ఉన్న ఆ అమ్మాయిని కాపాడటమే సినిమా కథ అని మొన్నటివరకూ చాలామంది చెప్పుకున్నారు. అయితే... తాజా సమాచారం ప్రకారం... ‘జై సింహా’ కథకు... మీడియా సర్కిల్స్ లో వినిపించిన కథకు సంబంధం లేదని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొంది. ఘన విజయం అందుకున్న ‘ముత్తు’ చిత్ర కథకు దగ్గరగా ‘జై సింహ’ కథ ఉంటుందని టాక్. ‘ముత్తు ’ కథను ప్రేరణ గా తీసుకొని ఈ కథ తయారు చేశానని కథకుడు, సంభాషణల రచయిత ఎం.రత్నం కూడా ఆడియో వేడుకలో చెప్పిన విషయం తెలిసిందే. ‘ముత్తు’ చిత్రానికి కూడా కె.ఎస్.రవికుమారే దర్శకుడు కావడం గమనార్హం.
‘జై సింహా’ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. ‘ముత్తు’లో రజనీ కూడా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ‘జై సింహా’లో బాలయ్య పాత్రలు కూడా ‘ముత్తు’ పాత్రల తరహాలోనే ఉంటాయట. అలాగే ‘ముత్తు’ సినిమాలో యాక్షన్ పార్ట్ కంటే సెంటిమెంట్ పాళ్లు ఎక్కువ. ఇందులో కూడా అంతేనట. టీజర్, ట్రైలర్స్ లో చూపించిన యాక్షన్ పార్ట్ అంతే... సినిమా క్లైమాక్స్ కి మాత్రమే పరిమితమై ఉంటుందని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం సెంటిమెంట్ కే ప్రాధాన్యత ఉంటుందని టాక్. సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమా కాబట్టి.. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కుటుంబ కథగా ‘జై సింహ’ను తెరకెక్కించారట దర్శకుడు కె.ఎస్.రవికుమార్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే... జనవరి 11 దాకా ఆగాల్సిందే.