కాంగ్రెస్.. వైసీపీలపై బాలయ్య దాడి..?
on Oct 28, 2017
మాస్ లో బాలకృష్ణ ఇమేజ్ సాధారణమైంది కాదు. అందుకే... మాస్ లీడర్ కూడా అయిపోయాడు. హిందూపురం ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నాడు. తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నాడు. తన సినిమాల్లోని డైలాగుల ద్వారా విపక్షలపై నిప్పులు కక్కడం బాలయ్యకు మామూలే. ‘లెజెండ్’లో సినిమా అయితే... ప్రతిపక్షాలను చెడుగుడు ఆడేశాడు. రాబోతున్న ‘జై సింహా’ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. వైజాగ్ లో ఈ సినిమాకోసం చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు బయట హల్ చల్ చేస్తున్నాయ్. ఈ స్టిల్స్ లో బాలయ్య పోలిటికల్ లీడర్లను తరుముతూ కనిపిస్తుడు. రోడ్ పై ధర్నా చేస్తున్న రాజకీయ నేతలపై లాఠీ జులిపిస్తున్నాడు. పైగా ఆ కోరమీసం.. బాలయ్యలోని రౌద్ర రసాన్ని ఆ కోరమీసం ఇంకాస్త ఇనుమడింపజేస్తోంది. ధర్నాలో కూర్చున్న వాళ్ల డ్రెస్సింగ్ - కండువాలు చూస్తే కాంగ్రెస్ పార్టీని తలపిస్తున్నాయి. ఇక ఓ వ్యక్తి పట్టుకున్న ప్లకార్డులో ‘వైజాగ్ లీడర్ రవిశంకర్ రెడ్డి జిందాబాద్’.. ‘పార్టీ షుడ్ గివ్ ఎంపీ టికెట్’ అని రాసి ఉన్నాయి. ఈ సెటప్ అదీ చూస్తే బాలయ్య కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్ని టార్గెట్ చేశాడేమో అనిపిస్తోంది. ఈ సినిమా కథ భావోద్వేగాల చుట్టూ నడుస్తుందని, ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయ్. ఇప్పుడు ఈ స్టిల్స్ చూస్తుంటే ఈ సినిమాలో ఇంకో యాంగిల్ కూడా ఉందని అవగతం అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. చూద్దాం... ఫలితం ఎలా ఉంటుందో.