‘జై లవకుశ’ కథ ఇదేనా?
on Sep 13, 2017
అదొక అందమైన కుటుంబం.. ఆటపాటలతో... సుఖసంతోషాల నెలవుగా ఉన్న ఆ కుటుంబం వైపు విధి కర్కశంగా చూసింది. ఆ రోజు రాత్రి.. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ కుటుంబంపై నరహంతకులు దాడి చేశారు. కంటిముందే రక్తపు మడుగులో పడి ఉన్న ఇంటిపెద్దను చూసి.. ఆ ఇల్లాలు విలవిలలాడింది. బిడ్డలనైనా కాపాడుకోవాలని భర్త శవాన్ని కూడా అక్కడే వదిలి.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టకొని ముగ్గురు పిల్లలతో పారిపోయింది. కానీ అక్కడ కూడా విధి వారిని వదల్లేదు. ఆ తల్లీబిడ్డలు చెట్టుకొకళ్లు పుట్టకొకళ్లు అయిపోయారు. కాలం ఇరవై ఏళ్లు పరుగు తీసింది. పెద్దవాడు పగతో రగిలిపోతూ పెరిగాడు. మిగిలి ఇద్దరూ చెరో చోట పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యారు. ఊహ లేనప్పుడు జరిగిన ఘోరం ఆ ఇద్దరికీ తెలీదు. మరి ఆ తల్లి ఎక్కడ? ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎలా కలుసుకున్నారు? తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఆ నరరూప రాక్షసులను ఏ విధంగా అంతమొందించారు? అనేది కథ..
ఏంటో... ఎక్కడో తెలిసిన కథలా ఉందే? అనుకుంటున్నారా? ‘యాందో కి బారాత్’ అని హిందీలో ఓ సినిమా వచ్చింది. ఆ కథే ఇది.
అదే కథను కొన్నాళ్ల తర్వాత ‘అన్నదమ్ముల అనుబంధం’ అని తీశారు. ఎన్టీయార్ హీరో. మురళీమోహన్, బాలకృష్ణ తమ్ముళ్లుగా నటించారు.
సరిగ్గా ఆ సినిమా వచ్చిన పదిహేనేళ్ల తర్వాత ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా వచ్చింది. సేమ్ కథ. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... చిరంజీవి ఇందులో త్రిపాత్రాభినయం చేశాడు.
మళ్లీ ఇప్పుడు అలాంటి తరహా కథే రాబోతోందని సమాచారం. దానిపేరే.. ‘జై లవకుశ’. ఇందులో జూనియర్ ఎన్టీయార్ త్రిపాత్రాభినయం చేశాడు. ఇందులో కూడా అలాగే ముగ్గురూ అన్నదమ్ములని తెలుస్తోంది. పెద్దవాడు ‘జై’ చూడ్డానికి రావణుడిలా విలన్ పోకడలతో ఉన్నాడు. మిగిలిన ఇద్దరూ లవకుమార్.. బ్యాంక్ ఉద్యోగిగా ఓ తరహాగా ఉంటే... ఇంకొకడు కుశకుమార్ దొంగ లా కనిపిస్తున్నాడు. అంటే.. దీన్ని బట్టి వీళ్లు కూడా చిన్నప్పుడే విడిపోయారన్నమాట. అసలు ‘జై’ విలన్ గా ఎందుకు మారాడు. అతను స్వతహాగా విలనేనా.. లేక తన కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన వాళ్లకోసం విలన్ గా మారాడా? అనేది తెలియాల్సి ఉంది.
‘యాదో కి బారాత్ ’ బాలీవుడ్ లో సన్సేషన్ క్రియేట్ చేసింది...
ఎన్టీయార్ ‘అన్నదమ్ముల అనుబంధం’.. తెలుగులో సంచలన విజయాన్ని సాధించింది.
చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసింది.
మరి ‘జై లవకుశ’ పరిస్థితి ఏంటో చూడాలి.