ఎన్టీఆర్కి కూడా నో ఎంట్రీ..?
on Sep 21, 2017
భారతదేశంలో సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..సినీతారలను వినోదం పంచే వారిగా కాకుండా తమ సొంత వ్యక్తుల్లా..ఇంకా ఎక్కువగా చెప్పాలంటే దైవంలా పూజిస్తారు అభిమానులు. తమ అభిమాన తారల సినిమాలు వస్తున్నాయంటే చాలు ఆ సందడి మామూలుగా ఉండదు. కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు అబ్బో ఆ హడావిడిని వర్ణించలేం. ఇప్పుడైతే ఆన్లైన్ విధానం అందుబాటులోకి వచ్చింది కానీ గతంలో టిక్కెట్ల కోసం అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాసేవారు.
ఎలాగైనా మార్నింగ్ షో చూడాలన్నది వారి కోరిక. ఇక అర్థరాత్రుల పూట వేసే బెనిఫిట్ షోలకు తెలుగునాట ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సినిమా టాక్ ముందే తెలిసిపోవడంతో దీని ప్రభావం కలెక్షన్లపై పడి నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోతున్నారు. దానికి తోడు అర్థరాత్రుల పూట అభిమానుల అరుపులు, కేకలతో పబ్లిక్ డిస్ట్రబ్ అవుతుండటంతో పోలీసులు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు నుంచి నిన్నటి పైసావసూల్ వరకు కఠినంగానే వ్యవహరించారు. తాజాగా యంగ్టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశకైనా పర్మిషన్ ఇస్తారనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. పోలీసులు అనుమతి ఇవ్వడానికి ససేమిరా అనడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.