టాలీవుడ్ ప్రముఖులపై ఐటీ రైడ్స్!
on Nov 20, 2019
తెలుగు సినిమా ప్రముఖులే లక్ష్యంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఇన్ కమ్ (ఐటీ) టాక్స్ అధికారులు రైడ్స్ చేయడం ప్రారంభించారు. దాంతో షెడ్యూల్ ప్రకారం జరగవలసిన కొన్ని షూటింగ్ లు రద్దయ్యాయి. ఓ ప్రెస్ మీట్ లొకేషన్ మారింది. టాలీవుడ్ ప్రముఖులు కాస్త ఇబ్బందికి గురయ్యారనే మాట అక్షర సత్యం. అసలు వివరాల్లోకి వెళితే...
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఇండస్ట్రీ కింగ్ పిన్ అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు ఆఫీసుల్లో బుధవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దగ్గుబాటి కుటుంబానికి చెందిన రామానాయుడు స్టూడియోలో సురేష్ బాబు ఆఫీస్ ఉంది. అలాగే, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆఫీస్ కూడా! అందువల్ల, బుధవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఇతరులు రాకుండా, ఐటీ అధికారులు గేటు తాళాలు వేశారు. దాంతో స్టూడియోలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న కొందరు ఇబ్బంది పడ్డారు. 'మిస్ మ్యాచ్' ప్రెస్ మీట్ లొకేషన్ రామానాయుడు స్టూడియో నుండి ఫిల్మ్ చాంబర్ కు మారింది.
సురేష్ బాబు ఆఫీసుతో పాటు ప్రముఖ యువ హీరో నాని ఇంటిపై కూడా ఐటీ అధికారులు రైడ్ చేశారు. ఏడాదికి మినిమమ్ రెండు చిత్రాల్లో నాని నటిస్తారు. ఇటీవల ఆయన పారితోషకం పెరిగిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో నానిపై ఐటి అధికారుల కన్ను పడి ఉండవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిపై కూడా ఐటీ రైడ్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.
Also Read