చిరు విహారయాత్ర... రెండు లాభాలు!
on Apr 4, 2019
మెగాస్టార్ చిరంజీవి జపాన్ లో ఉన్నారిప్పుడు! శ్రీమతి సురేఖతో కలిసి వేసవి విహార యాత్రకు వెళ్లారు. కొన్ని రోజులు దంపతులు ఇద్దరూ జపాన్ లోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శించి ఇండియాకి తిరిగి వస్తారు. చిరంజీవి జపాన్ వెళ్లారనే విషయం చిరు పెద్ద కుమార్తె సుష్మిత ట్వీట్ చేస్తే అందరికీ తెలిసింది. సైరా నరసింహారెడ్డి బిజీ షెడ్యూల్లో చిన్న బ్రేక్ దొరకడంతో అమ్మానాన్న జపాన్ వెళ్లారని, బ్రేక్ ఇచ్చిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కి థాంక్స్ అని సుష్మిత ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే... ఈ విహారయాత్రతో చిరంజీవికి రెండు లాభాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ నడిచింది. ఒక వ్యూహం ప్రకారమే ఆయన జపాన్ వెళ్లారని టాక్.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఎవరిది? చిరు తనయుడు రామ్ చరణ్, సతీమణి సురేఖది! ఇక్కడ బ్రేక్ ఇచ్చింది ఎవరు? అర్థమైంది కదూ! చిరంజీవి కావాలని బ్రేక్ తీసుకున్నారట. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తీవ్రతరమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఎన్నికల బరిలో దిగింది. జనసేన తరపున తమ్ముడు నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నాగబాబు కుమార్తె నిహారిక పాల్గొంటున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా, జనసేనకు ఓటు వేయమని కోరుతూ రామ్ చరణ్ ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. చిరంజీవి స్పందన ఏమిటని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచార వేడికి దూరంగా జపాన్ వెళ్లారని టాక్. ఎన్నికల వాతావరణాన్ని తప్పించుకోవడం ఒక లాభం అయితే... శ్రీమతితో జపాన్ పర్యాటక ప్రాంతాలను చుట్టే అవకాశం లభించడం మరో లాభం!