మహేష్ టీమ్ ఎత్తుగడకు బన్నీ ఏం చేస్తాడో?
on Dec 21, 2019
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ-రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈమేరకు మహేష్ ట్వీట్ చేశాడు. అందులో చిరును ఆకాశానికి ఎత్తేశాడు. "మా ఆహ్వానాన్ని మన్నించి 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ-రిలీజ్ ఫంక్షన్కి రావడానికి అంగీకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ రాకతో మా సంతోషం రెండింతలు అవుతుంది" అని మహేష్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఫంక్షన్లో ఎలాగో చిరంజీవి గురించి గొప్పగా చెబుతాడు. ఇవన్నీ మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓ రకంగా సంక్రాంతి పోటీలో మహేష్ సినిమాకు వ్యతిరేక ప్రచారం లేకుండా చేయడంలో సహాయపడతాయి. సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది పక్కన పెడితే... విడుదలకు ముందు సినిమాకు క్రేజ్ తీసుకురావడంలో మహేష్ టీమ్ వేసిన ఎత్తుగడకు బన్నీ ఏం చేస్తాడోనని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
జనవరి 11న మహేష్ 'సరిలేరు నీకెవ్వరు', జనవరి 12న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు విడుదలవుతున్నాయి. పాటలు, పోస్టర్లు, ప్రమోషన్స్ విషయంలో రెండు సినిమాల మధ్య భీకరమైన పోటీ నెలకొంది. ఒకరి పోటీగా మరొకరు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీకి మూల పురుషుడు, ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారిన చిరంజీవిని మహేష్ టీమ్ ప్రీ రిలీజ్ కి తీసుకొస్తుంది. అల్లు అర్జున్ టీమ్ ఆయనకు తగ్గ స్టార్ ని తీసుకు రాకపోతే 'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ కి క్రేజ్ ఉండదు. పవన్ కల్యాణ్ ని తీసుకొస్తే సబబుగా ఉంటుంది. మరి, అల్లు అర్జున్ కోసం కాకపోయినా త్రివిక్రమ్ కోసమైన పవన్ వస్తాడో? లేదో? చూడాలి. ప్రభాస్ ను తీసుకొచ్చినా బావుంటుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ మనసులలో ఏముందో?