అభినవ కర్ణుడు సోనూ సూద్కు హైకోర్టులోనూ చుక్కెదురు!
on Jan 21, 2021
కరోనా మహమ్మారి కాలంలో దానకర్ణునిగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సోనూ సూద్కు ఓ కేసు విషయంలో కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముంబైలో అనధికారికంగా, అక్రమంగా భవనం నిర్మించారనే ఆరోపణతో బీఎంసీ (బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్) ఇచ్చిన నోటీసుకు వ్యతిరేకంగా సోను వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. నిజాయితీ ఉన్నవారి వైపు న్యాయం ఉంటుందనీ, బీఎంసీనే సంప్రదించండనీ జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ముంబైలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్ అనే పేరుతో ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు సోను. అయితే నివాస సముదాయాన్ని హోటల్గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలు పొందాలని భావిస్తున్నారని పేర్కొంటూ 2020 అక్టోబర్ 20న సోనూసూద్కి బీఎంసీ నోటీసులు పంపింది. బీఎంసీ నోటీసును సవాల్ చేస్తూ సోను కోర్టును ఆశ్రయించారు. అయితే దాన్ని 2020 డిసెంబర్లో దిగువ కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్ డిపార్టుమెంట్ అనుమతులు తీసుకోకుండానే సోను పునర్నిర్మాణం మొదలుపెట్టారని బీఎంసీ తన వాదనలో వివరించింది.
ఈ సందర్భంగా నేరాలకు పాల్పడటం సోనూకు ఓ అలవాటుగా మారిందని అది సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను సోనూ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేస్తూనే కేవలం ఎంసీజెడ్ఎంఏ (మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. అది కూడా కోవిడ్-19 వల్ల ఆలస్యమతోందని వివరించినా బీఎంసీ వారు వినలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు గురువారం ఈ కేసును విచారించి అన్ని వివరాలు పరిశీలించి సోనూసూద్ పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇప్పుడు సోను ఏం చేస్తారో చూడాలి.
Also Read