బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి
on Sep 7, 2018
నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా ఇలా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అరుదైన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి.
తన 53 ఏళ్ల సినిమా కెరీర్లో తెలుగు , తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 150 చిత్రాల్లో నటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 1926 సెప్టెంబర్ నెల 7న జన్మించారు భానుమతి. ఈ శుక్రవారం ఆమె జయంతి సందర్భంగా పద్మశ్రీ భానుమతి రామకృష్ణ ని ఓ సారి తలచుకుందాం.
భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య. దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ అయిన పి.యస్ రామకృష్ణను ప్రేమించి పెళ్లాడారు. కానీ ఈ ప్రేమ వివాహం తండ్రి వెంకటసుబ్బయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో భానుమతి, రామకృష్ణను రహస్య వివాహం చేసుకుందట. భానుమతి, రామకృష్ణకు ఒకే ఒక కుమారుడు. పేరు భరణి. భరణి పేరు మీదనే భరణి స్టూడియోను నెకొల్పారు. భానుమతి మూడుసార్లు జాతీయ అవార్డు (అన్నై, అంతస్థు, పల్నాటియుద్ధం) అందుకున్నారు. 2013లో భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన 50 మంది ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలా బిళ్లలో ఒకటి భానుమతిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మనం చెప్పుకునే నటీమణి శ్రీమతి భానుమతీ రామకృష్ణ. ఆమె నటించినన్నాళ్లు హీరోయిన్గా చేశారనే కంటే హీరోగానే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏభై ఏళ్లు పైబడ్డ ఈ నట ప్రజ్ఞాశాలికి చిత్రరంగంలోని అన్ని శాఖతో అనుబంధముంది. ఈ ఏభై ఏళ్లూ ఆమె ‘చండీరాణి’లాగే ఉన్నారు. బ్రహ్మనాయుణ్ణి ఎదిరించి నిలిచిన నాగమ నాయకి లానే ఉన్నారు. ఆమె అనుకున్నది చేసేవారు. అలా చేయడంలో కొన్ని విషయాల్లో భర్త రామకృష్ణను కూడా లెక్కచేసేవారు కాదటామె. ముఖ్యంగా మూడు భాషలో తాను ద్విపాత్రాభినయం, దర్శకత్వం తదితర బాధ్యతను నిర్వహిస్తూ భారీ ప్రాజెక్ట్ ‘చండీరాణి’ని చేపడుతుంటే రామకృష్ణారావు గారు వద్దని గట్టిగానే చెప్పారు. కానీ చాలా పట్టుదలతో, ఒంటిచేత్తో చేస్తూ అన్ని బాధ్యతూ నిర్వహించి ‘చండీరాణి’ని చేసి విజయాన్ని సాధించారు. ఆమె సాహసానికి ఆనాడు దక్షిణాది ఇండస్ట్రీ అంతా ముక్కున వేలేసుకుంది.
ఒకసారి తను చేస్తున్న తమిళ చిత్రం షూటింగ్కు ఎమ్జీఆర్ ఆలస్యంగా వచ్చారు. ఆమె కొద్దిసేపు వెయిట్చేసి వెళ్లిపోయారు. మర్నాడు షూటింగ్కు ముందే వచ్చి కూర్చున్న ఎమ్జీఆర్ లేచి నిబడి ఆమెకు క్షమాపణ చెప్పారు. ఆమె నట జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. చివరి వరకూ హీరోతో కౌగలింతలు వంటి వాటికి ససేమిరా ఆమె ఒప్పుకునేవారు కాదు. చేయాల్సి వస్తే తన పాత్రకు తానే చేర్పులు మార్పులు చేసుకునేవారు. అలాగే సినిమాలో తను పాడే పాటను తానే స్వరపరచుకుని తానే పాడేవారు. ఇళయరాజా, సాలూరి వంటి పెద్ద సంగీత దర్శకులైతే సాంగ్ కంపోజింగ్లో తానే కూర్చుండే వారు. ఇన్ని కాంప్లికేషన్స్తో కూడా నటిగా ఆమె బిజీగానే ఉండేవారు.
ఆమె పాడిన పాటను ఇప్పటికీ మరో గాయని ఎవరూ అనుకరించి పాడలేరు. నటనలో కూడా ఆమెను అనుకరించే నటి ఇంతవరకూ రాలేదు! ఆమె పాట (అంటే గాత్రం) మాట, నటన పూర్తిగా విలక్షణమైనది.
భానుమతి తన 13వ ఏటనే చిత్రరంగంలోకి ప్రవేశించారు. నాటి ప్రముఖ దర్శకుడు సి.ప్లుయ్యగారి ‘వర విక్రయము’ చిత్రానికిగాను భానుమతి కెమెరా ముందుకొచ్చారు. ఆ రోజుల్లో ప్రముఖ హీరోలు సైతం ఆమె స్వాభిమానానికి, వ్యక్తిత్వానికి భయపడేవారు. ఈ విఖ్యాత నటి, గాయని 1994 జనవరిలో కలకత్తాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మోత్సవాల కు గెస్ట్ ఆఫ్ హానర్గా హాజరయ్యారు. ఇంతవరకు ఏ దక్షిణాది నటీమణికీ దక్కని గౌరవం అది. ముఖ్యంగా తెలుగు వారికి గర్వకారణమైన విషయం. 1956లో ఆనాటి తమిళ ముఖ్యమంత్రి అన్నాదురై నుండి ‘నడిప్పుక్కు ఇళక్కనమ్’ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డును ‘రంగూన్ రాధ’ అనే చిత్రానికిగాను అందుకున్నారు. ఆవిడ అపురూపమైన సేవకుగాను 1966లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించడం జరిగింది. ఆమె ‘అత్తగారి కథల’కు 1966లోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నారు. 1975లో ఆంధ్రా యూనివర్శిటీ డాక్టరేట్ గౌరవాన్నిచ్చింది. 1985లో తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాకు ప్రిన్సిపాల్గా నియమించబడ్డారు. 1986లో ప్రతిష్ఠఆత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. 1950లో డాక్టర్ భానుమతి ‘నిషాన్’ అనే హిందీ చిత్రంలో నటించడం ద్వారా హిందీ రంగంలోకి అడుగుపెట్టారు. 1951లో ఆమె నటించిన ‘మల్లీశ్వరి’ నటిగా, గాయనిగా ఆమెకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఆమె 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తను నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటికీ తానే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతతో పాటు సంగీతం, మాటలు, ఎడిటింగ్ మొదలైన బాధ్యతను కూడా నిర్వహించేవారు.
ఈ విలక్షణ నటి అటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు తోనూ, నాటి అగ్ర కథానాయకు డా. అక్కినేని, శివాజీ గణేశన్ తదితరులతో నటించారు . ఆమె లిస్ట్ లో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు లాంటి క్లాసిక్స్ బోలెడున్నాయి. మొదట మిస్సమ్మ చిత్రానికి భానుమతినే తీసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తొలగించి ఆ స్థానంలో సావిత్రిని తీసుకున్నారు చక్రపాణి. ఆ సినిమా విడుదలయ్యాక నేను మిస్సమ్మ నుంచి తప్పుకోవడం వలన సావిత్రి లాంటి మహానటి తెలుగు సినిమ పరిశ్రమకు పరిచయమైందని ఎంతో పాజిటివ్ స్పందిస్తూ సంతోషించిందట లేడీ టైగర్ భానుమతి. భానుమతీ రామకృష్ణ ఎప్పుడూ కాలక్షేపాన్ని కోరుకునేవారు కాదట. ఎందరో మహిళామణులకు ఆదర్శంగా నిలిచిన ఈ నట పండితురాలు కొద్దిపాటి అనారోగ్యంతో 2005 డిసెంబర్ 24న చెన్నైలోని స్వగృహంలో స్వర్గస్తులయ్యారు.