దర్శకులను మారుస్తున్న బాలకృష్ణ!
on Apr 26, 2019
ఎన్టీఆర్ బయోపిక్ తరవాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయాలి. 'యన్.టి.ఆర్' ఆడియోలో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. కానీ, ఇప్పుడా సినిమా కంటే ముందు మరో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. తన తదుపరి సినిమాకు ఆయన దర్శకుణ్ణి మార్చారు. గతేడాది సంక్రాంతికి 'జై సింహా' వంటి విజయాన్ని తనకు అందించిన కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. దీనికి సి. కల్యాణ్ నిర్మాత. 'జై సింహా' కాంబినేషన్లో మరో సినిమా వస్తుందన్నమాట. నిజానికి, 'జై సింహా' విజయం తరవాత నిర్మాత సి. కల్యాణ్ కి మరో సినిమా చేస్తానని బాలకృష్ణ మాట ఇచ్చారు. వివి వినాయక్ దర్శకత్వంలో ఆ సినిమా చేయాలని సన్నాహాలు చేశారు. ఏమైందో ఏమో... వినాయక్ స్థానంలో కె.ఎస్. రవికుమార్ వచ్చారు. ఇక, బోయపాటి సినిమా విషయానికి వస్తే... దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు. కె.ఎస్. రవికుమార్ సినిమా పూర్తయిన తరవాత ఆగస్టులో పట్టాలు ఎక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.