బాలయ్య నిర్మాతలు వణికిచస్తున్నారట!
on Dec 12, 2017
బాలయ్య నిర్మాతలందరూ భయంతో వణికిపోతున్నారట. కారణం ఏంటో తెలుసా? ఈ నెలలోనే కొత్త సినిమా ఓపెనింగ్ ఉండాలనేది ఆయన టార్గెట్ అట. అందుకే ఈ భయం. అదేంటి...! కొత్త సినిమా ఓపెనింగ్ అయితే మంచిదే కదా! మరి భయం దేనికి? అనుకుంటున్నారా? సరే విషయంలోకెళ్దాం. ప్రస్తుతం బాలయ్య ‘జైసింహ’ షూటింగ్ లో ఉన్నారు. ఆ సినిమా టాకీ పూర్తయిపోయింది. పాటలు బ్యాలెన్స్ ఉన్నాయ్. వాటిని పూర్తి చేయడానికి అబ్రాడ్ వెళ్లారు. డిసెంబర్ 17తో పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత వెంటనే కొత్త సినిమాను పట్టాలెక్కించేయాలనుకుంటున్నారు నటసింహం. ఆ కొత్త సినిమా పూర్తయిన తర్వాతే ఎన్టీయార్ బయోపిక్ చేస్తారట. అంటే... ఎన్నికలకు ముందుగా ఎన్టీయార్ బయోపిక్ ఉంటుందన్నమాట.
ఈ లోగా ఒక సినిమా చేయాలనేది ఆయన ఆలోచన. అయితే.. ఆలోచన మంచిదే.. కథే రెడీగా లేదు. ఆయనకు అటుఇటుగా నచ్చిన కథ మాత్రం ఒకటుంది. అదే.. ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన కథ. కథలేవీ లేని పక్షంలో.... కృష్ణారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడట బాలయ్య. అందుకే.. అడ్వాన్సులిచ్చిన నిర్మాతలంతా భయంతో వణికి చస్తున్నారట. బాలయ్య కోసం కథలు రెడీ చేస్తున్న దర్శకులను తెగ తొందరపెట్టేస్తున్నారట. అబ్రాడ్ నుంచి బాలయ్య తిరిగొచ్చే లోపు కథ రెడీ చేసి.. ‘కృష్ణారెడ్డి ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడండీ..’ అంటూ ప్రాధేయపడుతున్నారట. ఆయనొచ్చి.. కృష్ణారెడ్డికి ‘ఓకే’ చెప్పేసి.. తమలో ఎవర్ని పిలిచి చేయమంటారో అని తెగ భయపడిపోతున్నారట. అందుకే.. ఓ వైపు అనిల్ రావిపూడి, మరో వైపు సాయిమాధవ్ బుర్రా ఇద్దరూ బాలయ్యకు విడివిడిగా కథలు తయారు చేసే పనిలో పడ్డారని విశ్వసనీయ సమాచారం.
బాలయ్య ఊరు నుంచి రాగానే.. ముందు వీరి కథలు వింటారట. వీరి కథల్లో ఏదో ఒకటి ‘ఓకే’ అయితే... నిర్మాతలు ఊపిరి పూల్చుకుంటారు. ‘ఓకే’ కాకపోతే.. నిర్మాతల గుండెల్లో పిడుగు పడ్డట్టే. ఇదిలావుంటే... బాలయ్య కథనాయకునిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీగా ఉన్నారని సమాచారం. మరి నటసింహం ఎవరికి పచ్చజెండా ఊపుతారో చూడాలి.