అలీ సమర్పించు... రౌడీ–వేశ్య ప్రేమకథ!
on Sep 17, 2018
కమెడియన్ అలీ చేయి పడకపోతే ఈ సినిమా గురించి ఎవరికీ తెలిసేది కాదేమో! కమెడియన్గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన అలీ, కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అప్పుడెప్పుడూ నిర్మాతగా మారలేదు. తమ్ముడు సినిమాల్లోకి వచ్చి వేషాల కోసం, ఒక్క హిట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనూ నిర్మాతగా మారలేదు. ఆల్మోస్ట్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ కెరీర్ క్లోజ్ అయ్యిందనుకున్న తరుణంలో ‘దేశంలో దొంగలు పడ్డారు’ అనే సినిమాలో హీరోగా చేశాడు. ఈ సినిమా మొదలైనప్పుడు ఎవరికీ తెలియదు. టీజర్ విడుదలైనప్పుడూ ఎవరికీ తెలియలేదు. అలీ పేరు మహమ్మద్ అలీగా ఈ సినిమాకి సమర్పకుడిగా పడగానే సినిమాకి కొంచెం క్రేజ్ వచ్చింది. ఆయన రూపాయి పెట్టుబడి పెట్టలేదు గానీ... సినిమా చూసి నచ్చడంతో ఆయన సమర్పణలో విడుదల చేయడానికి అంగీకరించారు. శనివారం సాయంత్రం చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరి కొంచెం ఆసక్తి కలిగించింది. ట్రైలర్ని గమనిస్తే... తనను కిడ్నాప్ చేసిన రౌడీతో, అనుకోని పరిస్థితుల్లో వేశ్యగా మారిన ఓ అమ్మాయి ప్రేమలో ఎలా పడింది? వాళ్ల కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది చిత్రకథగా తెలుస్తుంది. ‘కృతజ్ఞత కోరుకుంటే నువ్వు మనిషివి కాదు... చూపించకపోతే నేనూ మనిషిని కాదు’ అనే డైలాగ్ కథలో ఎమోషన్ కంటెంట్ని తెలియజేస్తుంది. ‘మంచోడు సినిమాల్లో, పుస్తకాల్లో మాత్రమే గెలుస్తాడు’ అనే డైలాగులు, స్నేహితుడే హీరోని చంపాలని ఎత్తులు వేయడం... ప్రేమకథతో పాటు సినిమా కథలో ఎన్నో మలుపులు వున్నాయని స్పష్టం చేస్తుంది. ట్రైలర్ ఆసక్తిగా వుంది. సినిమా ఎలా వుంటుందో??
Also Read