తొలి టైమ్ ట్రావెలింగ్ ఫిలిం ఆదిత్య 369
on Oct 1, 2018
తొలి టైమ్ ట్రావెలింగ్ ఫిలిం ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలోనే కాదు భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం `ఆదిత్య 369`. తొలి టైమ్ ట్రావెలింగ్ ఫిలింగా టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఇది. అప్పటి వరకు సినిమాలన్నీ ఒకదారిలో వెళ్తుంటే ఈ చిత్రం వచ్చి తెలుగు సినిమా దశ దిశ మార్చి దర్శక నిర్మాతలను ఆలోచనలో పడేసింది. అందుకే ఈ సినిమాని పాథ్ బ్రేకింగ్ ఫిలింగా అప్పట్లో సినీ పండితులు కొనియాడారు. ఇలాంటి టెక్నికల్ ఫిలింస్ హాలీవుడ్ లో తప్ప ఇండియన్ ఫిలింస్ లో చూసింది లేదు. తొలిసారి ఓ అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు సింగీతం శ్రీనివాసరావు. కమర్షియల్ సినిమాలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య ఓ ఎక్స్ పర్ మెంటల్ సినిమాకు ఓకే చెప్పడం అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. బాలయ్య ఆ సినిమా చేయవద్దంటూ బాలయ్య ఫ్యాన్స్ సంఘాల నుంచి ఎంతో ఒత్తిడి కూడా వచ్చిందట.
కానీ, బాలకృష్ణ కు స్టోరీ కొత్తగా అనిపిండంతో ఎందరు ఒత్తిడి తెచ్చినా సినిమా చేసి తీరాడు. తన కెరీర్ లో నే ఓ గొప్ప చిత్రంగా `ఆదిత్య 369` నిలిచిపోయింది. ఒక సక్సెస్ ఫుల్ సినిమాకు అన్ని కుదురుతాయన్నట్టు ఈ సినిమాలో ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ అంతా పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు.
మొదట ఈ చిత్రం కోసం విజయశాంతిని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మోహినిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రం కోసం పి.సి,శ్రీరామ్, కబీర్ లాల్, వియస్ ఆర్ స్వామి ముగ్గురు దిగ్గజాలు సినిమాటోగ్రఫీ చేశారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ కథ గురించి ఓ సారి నిర్మాత కృష్ణమోహన్ కి చె ప్పగా ఆయనకు ఇంట్రస్టింగ్ గా అనిపించి సినిమా చేయడానికి ముందుకొచ్చారు. శ్రీకృష్ణ దేవరాయుల కు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుందనడంతో వెంటనే ఆయనకు బాలయ్య అయితే సరిగ్గా సరిపోతాడనిపించి ఆయన్ను సంప్రదించడం సినిమా ప్రారంభించడం జరిగింది. మొదట కోటి అరవై లక్షల్లో సినిమా కంప్లీట్ చేయాలనుకున్నారు..కానీ సెట్స్ , సీజీ వర్క్ విపరీతంగా ఉండటంతో ఇంకో 30 లక్షల బడ్జెట్ పెరిగింది. అప్పటికే సినిమాకు ఓ రేంజ్లో క్రేజ్ రావడంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ బడ్జెట్ పెరిగినా పెట్టడానికి ముందుకొచ్చారు.
కోటి అరవై లక్షల్లో రూపొందిన ఈ చిత్రం దాదాపు 9 కోట్లు సంపాదించింది. కర్ణాటకలో 25 లక్షలు కలెక్షన్స్ రాబట్టుకుంది. తమిళ్ లో అపూర్వ శక్తి గా, హిందీలో మిషన్ 369గా అనువదించబడింది. ఈ చిత్రానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాటలన్నీ పాడటంతో పాటు సైంటిస్ట్ గా నటించిన టిను ఆనంద్ కు డబ్బింగ్ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ ఫిలిం కావడంతో ఇందులో సైంటిస్ట్ పాత్రలో నటించిన టిను ఆనంద్ గెటప్ ఐన్ స్టీన్ తరహాలో డిజైన్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా దూరదర్శన్ లో ప్రమోటం చేయడం విశేషం. జూలై 18న 1991లో సినిమా విడుదలై వండర్స్ సృష్టించిన ఈ చిత్రం `బ్యాక్ టు ఫ్యూచర్`, హెచ్ జి వెల్స్` అనే హాలీవుడ్ చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయి తీసారు. ఈ సెన్స్ ఫిక్షన్ కు హిస్టరీతో పాటు క్రైమ్, లవ్ జత చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించారు.
ఆ టైమ్ లో భారీ బడ్జెట్ తో దాదాపు 110 రోజులు షూటింగ్ జరుపుకుంది. మొదట ఈ సినిమాకు యుగ పురుషుడు, ఆదిత్యుడు టైటిల్స్ అనుకున్నారు. ఫైనల్ గా `ఆదిత్య 369` టైటిల్ తో సినిమా రిలీజ్ చేశారు.