'మీ టూ' ఎఫెక్ట్: రెహమాన్ రెండు నాల్కల ధోరణి?
on Sep 10, 2019
హిందీ నటి తనుశ్రీ దత్తా ఇండియాలో 'మీ టూ' ఉద్యమానికి ఊపిరి పోశారు. తర్వాత దక్షిణాదిలోనూ పురుడు పోసుకుంది. ముఖ్యంగా తమిళనాట గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి 'మీ టూ' ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా పేరొందిన కొందరు మహిళలను ఎలా వేధించారు అనేది బయటపెట్టి సంచలనాలకు తెర తీశారు. తనకు ఎదురైన చేదు అనుభవాలతో పాటు ఇతరులకు ఎదురైన అవమానాలు, వేధింపులను తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిన్మయి పోస్ట్ చేసేవారు. అందులో వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు ముఖ్యమైనవి. ఇప్పుడు అదే వైరముత్తుకు మణిరత్నం దర్శకత్వం వహించనున్న ప్రతిషాత్మక 'పొన్నియిన్ సెల్వన్'లో పాటలన్నీ రాస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో యువతకు ఆగ్రహం తెప్పించింది. దాంతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పై విరుచుకుపడ్డారు. వైరముత్తుకు అవకాశం ఎలా ఇస్తారంటూ అతడిని ప్రశ్నిస్తున్నారు. దీనంతటికీ 'మీ టూ' ఉద్యమ సమయంలో రెహమాన్ చేసిన ట్వీట్ కారణం.
"మీ టూ ఉద్యమాన్ని గమనిస్తున్నాను. కొన్ని పేర్లు నన్ను షాక్ కి గురి చేశాయి. మన ఇండస్ట్రీ మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా, స్వచ్ఛంగా మారాలని ఆశిస్తున్నాను. బాధిత మహిళలకు మరింత శక్తి ఇవ్వాలి. నేను, నా టీమ్ ప్రతి ఒక్కరికీ సురక్షిత పని వాతావరణాన్ని కల్పించడానికి కట్టుబడి ఉన్నాం" - ఇదీ అప్పట్లో రెహమాన్ చేసిన ట్వీట్. ఆయన వైరముత్తుకు ఎలా అవకాశం ఇచ్చారని సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. వీటికి రెహమాన్ ఇచ్చిన సమాధానం వారికి మరింత ఆగ్రహాన్ని తెప్పించే విధంగా ఉంది. "క్రియేటివ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' గురించి మాకు కొంత ప్రైవసీ, టైమ్ కావాలి" అన్నారు. అంతే కాదు కొన్ని రోజుల క్రితం "సమయం సరైన పాఠాలు నేర్పుతుంది. గాయాలను నయం చేస్తుంది. మనల్ని మరింత శక్తివంతులుగా, తెలివైనవారిగా, నిజాయతీపరులుగా మారుస్తుంది. తమ తప్పులు తెలుసుకున్నవారికి రెండో అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా వాళ్ల బ్యాడ్ కంటే టాలెంట్ గొప్పది అయినప్పుడు" అని 'మీ టూ' ఉద్యమం గురించి కామెంట్ చేశారు. వైరముత్తుకు అవకాశం ఇవ్వడం కోసం ముందు జాగ్రత్తగా అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. రెహమాన్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read