తోడబుట్టిన వాళ్లే నాకు అన్యాయం చేశారు!
on Nov 27, 2017
ఏఆర్ రెహ్మాన్.. తన వ్యక్తి గత జీవితం గురించి చాలా అరుదుగా మాట్లాడతాడు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తనకు వ్యక్తిగతంగా జరిగిన ఓ అన్యాయం గురించి చెప్పుకొని వాపోయాడు. అదేంటంటే... తనకు సంగీత దర్శకుడు అయిన కొత్తగా చాలా ప్రేమలేఖలు వచ్చేవట. అయితే... వాటిని తన దాకా రానీయకుండా తన అక్కచెల్లెళ్లు దాచేసేవారట. ఆ తర్వాత వాటిని పారేసేవారట. ఈ కారణంగా తనకు వచ్చిన ఒక్క ప్రేమలేఖను కూడా తాను చదవలేకపోయాడట. ఒకవేళ ఆ ప్రేమలేఖల్లో ఏదో ఒక ప్రేమలేఖ నా మనసును కదిస్తే... నేను కూడా ప్రేమలో పడేవాడ్నేమో.. అయినా.. ఇలాంటి అక్కచెల్లెళ్లు ఉంటే ఎవరైనా ఎలా ప్రేమలో పడతారు? అంటూ ఫక్కున్న నవ్వేశారు రెహ్మాన్. అంతేకాదు.. మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు.
తను సంగీత దర్శకునిగా ఓ రికార్డింగ్ స్టూడియో పెట్టుకోవాలనుకున్నప్పుడు... తన దగ్గర డబ్బులే లేకవట. తన కోరిక తెలుసుకొని తన తల్లి తన నగల్నీ తీసి రెహ్మాన్ కి ఇచ్చేసిందట. వాటిని అమ్మి.. ఆ వచ్చిన డబ్బుతో రికార్డింగ్ స్టూడియో పెట్టాడట. ఆ స్టూడియోలోనే ‘రోజా’ పాటలు రికార్డింగ్ చేసి మణిరత్నంకి వినిపించాడట రెహ్మాన్. ఆ తర్వాత తన సుడి ఏ రేంజ్ లో తిరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదనుకుంట. ఎన్ని నగలైతే అమ్మవి అమ్మాడో... అంతకు మూడొంతులు నగలు మళ్లీ అమ్మకు చేయించాడట. రెహ్మాన్ ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకున్నాడు. రెహ్మాన్ జన్మతహా హిందువు అన్న విషయం చాలామందికి తెలీదు. తన అసలు పేరు దిలీప్ కుమార్. అయితే... 1988లో వారి కుటుంబం మొత్తం ఇస్లాం లోకి మారారు. ఆ తర్వాతే తాను ఏఆర్ రెహ్మాన్ అయ్యాడు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ అందుకునే ఏకైక భారతీయుడు ఏఆర్ రెహ్మాన్ మాత్రమే. దటీజ్ రెహ్మాన్.