'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్బస్టర్ అవుతుందని చెప్పడానికి 9 కారణాలు...
on Nov 26, 2019
సంక్రాంతి సెలవుల్ని లక్ష్యంగా చేసుకొని 2020 జనవరి 12న విడుదలవుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్లో ఒకటి. సూపర్స్టార్ మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావడానికి ఎందుకు అవకాశముందో కనీసం 9 కారణాలను మనం చెప్పుకోవచ్చు. అవేమిటో ఒక లుక్కేద్దాం..
1. మహేశ్ క్యారెక్టర్
'సరిలేరు నీకెవ్వరు' మూవీలో ఆర్మీ మేజర్ అజయ్కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు మహేశ్. దేశభద్రతను పరిరక్షించే సైనికుడిగా మహేశ్ నటించడం ఇదే తొలిసారి. ఆ లుక్లో మహేశ్ బాగా ఆకట్టుకున్నాడు. టీజర్లో అతను ఆర్మీ మేజర్గా గన్ పట్టుకొని కనిపించిన తీరు కానీ, అతను చెప్పిన డైలాగ్స్ కానీ ఇంప్రెసివ్గా ఉన్నాయి. అలాగే అన్యాయాన్ని సహించని వ్యక్తిగానూ అతను దర్శనమిస్తున్నాడు. ప్రకాశ్రాజ్ మనుషుల్ని చితగ్గొట్టి, "మన దగ్గర బేరాల్లేవమ్మా" అంటూ అతను చెప్పిన విధానంతో అతని క్యారెక్టర్ ఎంత శక్తివంతంగా కనిపిస్తుందో అర్థమవుతోంది.
2. పదమూడేళ్ల తర్వాత తెరపై కనిపించనున్న విజయశాంతి
2006లో వచ్చిన 'నాయుడమ్మ' సినిమా తర్వాత విజయశాంతి మళ్లీ సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆమె తిరస్కరిస్తూ వచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన కథ, తనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించారు. లేడీ సూపర్స్టార్ ఇమేజ్ ఉన్న ఆమె ఈ సినిమాలో ఆ ఇమేజ్కు తగ్గ శక్తిమంతమైన పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆమె లుక్ ఆకట్టుకుంది.
3. మహేశ్-విజయశాంతి కాంబినేషన్లో రెండో సినిమా
మహేశ్, విజయశాంతి కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. 1989లోనే ఆ ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా 'కొడుకు దిద్దిన కాపురం'. ఆ మూవీలో విజయశాంతి కవల పిల్లలుగా మహేశ్ డ్యూయల్ రోల్ చేశాడు. కాకపోతే అప్పుడు మహేశ్ బాలనటుడు. పదమూడేళ్ల పిల్లాడు. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో ఆ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంటుందన్నది వెల్లడి కాలేదు. ఒక ఇంటర్వ్యూలో తమ మధ్య బంధుత్వమేమీ ఉండదని విజయశాంతి వెల్లడించారు. అయినప్పటికీ ఆమె కోసం మహేశ్.. విలన్లతో తలపడతాడు. ఎందుకనేది ఆసక్తికరం.
4. అనిల్ రావిపూడి దర్శకత్వం
ఓటమెరుగని దర్శకుల లిస్టులో చేరిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఐదో సినిమా ఇది. ఇదివరకు అతను 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్2' వంటి వరుస హిట్లు రూపొందించాడు. మునుపటి సినిమా 'ఎఫ్2' అయితే బ్లాక్బస్టర్ హిట్టయింది. వెంకటేశ్, వరుణ్తేజ్, అనిల్ కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు మహేశ్ను అతను డైరెక్ట్ చేస్తుండటంతో వాళ్ల కాంబినేషన్కు మరింత క్రేజ్ వచ్చింది. సంక్రాంతి సెంటిమెంట్ కూడా తోడైతే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కచ్చితంగా సంక్రాంతి విన్నర్ అవడమే కాకుండా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
5. మహేశ్-రష్మిక జోడీ
హీరోయిన్గా స్వల్పకాలంలో యువతరం కలల రాణిగా అవతరించిన రష్మికా మందన్న తొలిసారి మహేశ్ జోడీగా నటిస్తుండటంతో అందరిలోనూ ఆ ఫ్రెష్ పెయిర్పై దృష్టి సారిస్తున్నారు. ఇద్దరి మధ్యా 21 సంవత్సరాల వయసు తేడా ఉన్నప్పటికీ, 44 ఏళ్ల వయసులోనూ ముప్పై ఏళ్ల లుక్లో కనిపించే మహేశ్ సరసన రష్మిక సరిగ్గా సరిపోయిందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక లుక్ వెల్లడైంది. అందంలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడేట్లు ఉండే ఆ జోడీ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పాలి.
6. మహేశ్ - ప్రకాశ్ రాజ్ కాంబినేషన్
మహేశ్ హీరోగా, ప్రకాశ్ రాజ్ విలన్గా వచ్చిన 'ఒక్కడు', 'పోకిరి' సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. అలాగే ఆ ఇద్దరూ తండ్రీకొడుకులుగా నటించిన 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలూ హిట్టయ్యాయి. ఇందులో మరోసారి ఆ ఇద్దరూ హీరో విలన్లుగా నటిస్తున్నారు. రాయలసీమకు చెందిన ఎద్దుల నాగేంద్ర అనే రాజకీయ నాయకుడిగా దుష్ట పాత్రను చేస్తున్న ప్రకాశ్ రాజ్ను 'ఒక్కడు' మూవీ తరహాలో కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్ ఎదుర్కొనే సీన్లు అదిరిపోతాయని సమాచారం.
7. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్
'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన దేవి, వరుసగా మహేశ్తో చేస్తోన్న మూడో సినిమా ఇది. ఓవరాల్గా ఐదో సినిమా. అదివరకు '1.. నేనొక్కడినే', 'శ్రీమంతుడు' సినిమాలకు అతడిచ్చిన ట్యూన్స్ కూడా సంగీతప్రియుల్ని అలరించాయి. 'సరిలేరు నీకెవ్వరు' మూవీకి అతడిచ్చిన ట్యూన్స్ ఇంతదాకా బయటకు రాకపోయినా అతని మ్యూజిక్పై భారీ అంచనాలున్నాయి. ఎక్కువ సమయం తీసుకొని మరీ అతను ఈ సినిమాకు క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడని సమాచారం. కచ్చితంగా 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్లో దేవి మ్యూజిక్ భాగమవుతుందని యూనిట్ మెంబర్స్ అంటున్నారు.
8. కామెడీ
డైరెక్టర్ అనిల్ రావిపూడి బలమంతా కథలో అతను సృష్టించే కామెడీ సన్నివేశాల్లో ఉందనే విషయం మనం గ్రహించాం. 'ఎఫ్2'లో అతడిలోని హాస్య రచయిత ఎంతగా చెలరేగిపోయాడో మనం చూశాం. కేవలం కామెడీ వల్లే ఆ మూవీ బ్లాక్బస్టర్ అయ్యిందనేది కాదనలేని నిజం. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోనూ అతడు హిలేరియస్ కామెడీ సీన్లు సృష్టించాడు. యాక్షన్, ఎమోషనల్ డ్రామాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో, కామెడీకీ అంతే ప్రాధాన్యం ఇచ్చి సన్నివేశాల్ని అతను తీర్చిదిద్దుతున్నాడు. కామెడీని పండించడంలో మహేశ్ ఎంత సిద్ధహస్తుడో 'మురారి' మూవీ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అతడి కామెడీ టైమింగ్ను ఈ సినిమా ఇంకో లెవల్లో చూపించబోతోంది. టామ్ అండ్ జెర్రీ తరహాలో రాజేంద్రప్రసాద్, మహేశ్ మధ్య వచ్చే కామెడీ సీన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.
9. బ్యాగ్రౌండ్
ఏ సినిమా స్టోరీకైనా బ్యాగ్రౌండ్ చాలా కీలకం. 'సరిలేరు నీకెవ్వరు'లో మనకు రెండు రకాల బ్యాగ్రౌండ్స్ కనిపిస్తాయి. ఒకటి ఆర్మీ బ్యాగ్రౌండ్ అయితే, ఇంకొకటి కొండారెడ్డి బురుజు ఉన్న రాయలసీమ బ్యాగ్రౌండ్. కశ్మీర్ లోయలో స్కూలు పిల్లలను టెర్రరిస్టుల నుంచి మహేశ్ కాపాడే సీన్లు ఎంతగా ఆకట్టుకుంటాయో, విజయశాంతి కోసం రాయలసీమలో ప్రకాశ్రాజ్తో మహేశ్ తలపడే సీన్లు అంతగానూ మెప్పిస్తాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్, రష్మిక మధ్య రొమాంటిక్ సీన్లూ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడతాయి.
Also Read