సైరా... అల్లు అర్జున్ కావాలనే రాలేదా?
on Sep 23, 2019
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా నరసింహారెడ్డి'. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ అభిమాన సందోహం మధ్య గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చిరు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా కొణిదెల హీరోలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి శ్రీమతి సురేఖ, కుమార్తెలు సుష్మిత, శ్రీజ... ఆఖరికి త్వరలో ఉప్పెన చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ కూడా వచ్చారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం ఈ వేడుకకు రాలేదు. అతని తమ్ముడు అల్లు శిరీష్ కూడా రాలేదు. అల్లు ఫ్యామిలీ నుండి అరవింద్ ఒక్కరే అటెండ్ అయ్యారు. వేదిక మీద ఆయన మైక్ పట్టుకోగానే... ముందున్న అభిమానులు వద్దంటూ చేతులు ఊపారు. ఈ హఠాత్ పరిణామంతో ఖంగు తినడం అల్లు అరవింద్ వంతయింది. ఒక్క విషయం ఒక్క విషయం చెబుతాను అంటూ అభిమానులను ఆయన రిక్వెస్ట్ చేశారు. అభిమానుల్లో అల్లు అరవింద్ పై వ్యతిరేకత వ్యక్తం కావడానికి అల్లు అర్జున్ కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
'చెప్పను బ్రదర్' ఇన్సిడెంట్ అభిమానులు ఇంకా మరిచిపోలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే వైరా వేడుకకు అల్లు అర్జున్ ఎందుకు డుమ్మా కొట్టాడో అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్. హైదరాబాద్ సిటీ లోనే అల్లు అర్జున్ 'అల... వైకుంఠపురంములో' షూటింగ్ చేస్తున్నాడు. ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాను నిర్మిస్తుంది. సైరా వేడుకకు అల్లు అర్జున్ రావాలనుకుంటే... షూటింగ్ క్యాన్సల్ చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. ఒకవేళ ఆర్టిస్టుల డేట్స్ దొరకవు అనుకుంటే... త్వరగా షూటింగ్ పూర్తి చేయడం పెద్ద విషయం కాదు. అల్లు అర్జున్ కావాలనే రాలేదని మెగా అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా... అతడు గైర్హాజరు కావడం చర్చనీయాంశం అవుతోంది. అతడిపై మెగా అభిమానుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.