ENGLISH | TELUGU  

'సైరా' ఈవెంట్ బ్లాక్‌బస్టర్ హిట్!

on Sep 23, 2019

 

'సైరా.. నరసింహారెడ్డి' ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈవెంట్‌కు వేదికగా నిలిచిన ఎల్బీ స్టేడియం మెగా ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. వేడుక మరో రెండు మూడు గంటల్లో మొదలవుతుందనంగా దాదాపు గంటన్నరసేపు ఏకధాటిగా వర్షం కురవడంతో చిరంజీవి బృందం, అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. స్టేడియం సీట్లు, గ్రౌండ్ ముద్దగా తడిసిపోయాయి. అయితే ఆ తర్వాత వర్షం ఆగడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగానే ఈవెంట్ సజావుగా, కోలాహలంగా జరిగింది.

ఈ ఈవెంట్‌కు ప్రధానాకర్షణగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. అతిథులుగా హాజరైన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దేశంలోనే టాప్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి అదనపు ఆకర్షణ అయ్యారు. వి.వి. వినాయక్, కొరటాల శివ వంటి దర్శకులూ ఈ వేడుకకు వచ్చారు. ఇక చిరంజీవి మాతృమూర్తి మినహా ఆయన కుటుంబమంతా దాదాపు ఈ వేడుకకు హాజరయింది. 'సైరా' నిర్మాత హోదాలో రాంచరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, కూతుల్లు సుస్మిత, శ్రీజ, కోడలు ఉపాసన్, బావమరిది అల్లు అరవింద్, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు, మేనల్లుడు అల్లు అర్జున్ మాత్రం ఈ వేడుకకు రాలేకపోయారు.

ఇక మూవీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా నటించిన అమితాబ్ బచ్చన్ వస్తారేమోనని ఏ మూలో ఆశతో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పటివరకూ 'సైరా'కు సంబంధించిన ఏ వేదికపైనా, ఏ ప్రచార కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనలేదు. చివరకు ఆ మధ్య ముంబైలో జరిగిన 'సైరా' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆయన కనిపించలేదు. అలాగే నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ, ప్రియురాలు లక్ష్మి పాత్రల్ని పోషించిన నయనతార, తమన్నా.. ఈ వేడుకకు దూరంగా ఉండిపోయారు. అత్యంత అరుదుగా మాత్రమే సినిమా ప్రమోషన్‌లో పాల్గొనే నయనతార.. ఈ వేడుకకూ అదే నియమాన్ని పాటించింది. సాధారణంగా తన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనే అలవాటున్న తమన్నా హాజరుకాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనివార్య పరిస్థితుల వల్లే ఆమె రాలేకపోయిందని సమాచారం.

సినిమాలో కొద్దిసేపు కనిపించే అవుకు రాజు కేరెక్టర్ చేసిన కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ మరో కీలక పాత్ర చేసిన భోజ్‌పురి స్టార్ రవికిషన్ కూడా అటెండ్ కాలేదు. వీరారెడ్డి పాత్రను చేసిన మన విలక్షణ నటుడు జగపతిబాబు, రాజాపాండి రోల్‌లో కనిపించనున్న తమిళ స్టార్ విజయ్ సేతుపతి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మాట్లాడారు కూడా. టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ప్రధానమైన వాళ్లంతా హాజరయ్యారు. కథను సమకూర్చిన పరుచూరి బ్రదర్స్‌లో అగ్రజుడు వెంకటేశ్వరరావు ఈ ఈవెంట్‌కు రాగా, గోపాలకృష్ణ రాలేదు. డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఫైట్ మాస్టర్ రాం-లక్ష్మణ్ వంటి వాళ్లు హాజరయ్యారు.

అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన 'సైరా' టైటిల్ సాంగ్ ఈ వేడుకలో మరో ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగిన సాహిత్యం, దాని తగిన బాణీలతో కూడిన ఆ పాటను ప్రదర్శించగానే స్టేడియం అంతా కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

ఇక వేదికపై ఉన్నంతసేపూ బాబాయ్ అబ్బాయ్.. పవన్ కల్యాణ్, రాంచరణ్ చాలా క్లోజ్‌గా గడిపారు. చరణ్ తరచూ బాబాయ్‌తో ఏదో ఒకటి చెబుతూ కనిపించాడు. అతిథులందరూ చిరంజీవితో పాటు, గొప్ప గట్స్‌తో భారీగా ఖర్చుపెట్టి 'సైరా'ను నిర్మించాడంటూ చరణ్‌ను పొగడ్తలతో ముంచేశారు. అన్నయ్య చిరంజీవిని చరిత్రలో నిలిచిపోయే గొప్ప పాత్రలో చూడాలని ఎన్నో ఏళ్ల నుంచీ తాను అనుకుంటూ వచ్చాననీ, ఇప్పుడు ఆ పనిని తనకంటే చాలా చిన్నవాడైన చరణ్ చేశాడనీ పవన్ కల్యాణ్ ప్రశంసించాడు. తను ఇంటర్మీడియేట్‌లో ఫెయిలయినప్పుడు డిప్రెషన్‌కు గురై అన్నయ్య తుపాకీతో కాల్చుకొని చనిపోవాలని అనుకున్నాననీ, కానీ జీవితం ముందు ఇంటర్మీడియేట్ పరీక్ష ఫెయిలవడం పెద్ద విషయం కాదంటూ అన్నయ్య తనకు ధైర్యాన్నిచ్చాడనీ, ఆయనిచ్చిన ధైర్యం వల్లే ఈరోజు నేను మీముందున్నాను అంటూ ఎమోషనల్‌గా పవన్ మాట్లాడాడు.

దాదాపు అరగంటసేపు మాట్లాడిన చిరంజీవి రాజమౌళి, రాంచరణ్, సురేందర్ రెడ్డిలను ప్రశంసించారు. రాజమౌళి 'బాహుబలి' సినిమాను తీయకపోతే, తాము 'సైరా'ను తలపెట్టేవాళ్లమే కాదని చెప్పి ఆశ్చర్యపరిచారు. 'బాహుబలి'తో రాజమౌళి తెలుగువాళ్లంతా గర్వపడేట్లు చేయడమే కాకుండా, ఎంతోమందికి ధైర్యాన్నిచ్చాడని కొనియాడారు. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏదడిగితే అది సమకూర్చి రాంచరణ్ ఎంతో ధైర్యంగా ఈ సినిమా నిర్మించాడని ఆయన అన్నారు. జాజియాలో ఒక్టిన్నర నెలపాటు షూట్ చేసిన వార్స్ సీన్స్ కోసమే 75 కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాడని చిరంజీవి చెప్పారు.

'సైరా'ను యూత్ సినిమాగా ఆయన అభివర్ణించారు. సినిమా ఆరంభంలో, ముగింపులో రెండు నిమిషాల సేపు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ వస్తుందనీ, యూత్‌కు కనెక్టవడం కోసం ఆ వాయిస్ ఓవర్‌ను పవన్‌తో చెప్పించామనీ చిరంజీవి తెలిపారు. 'సైరాను' తెలుగువాళ్లు మాత్రమే కాకుండా భారతీయులందరూ గర్వించే సినిమాగా ఆయన అభివర్ణించారు.

ఓవరాల్‌గా 'సైరా' ప్రి రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవడంతో మెగాస్టార్ బృందంతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. ఇక మిగిలింది.. అక్టోబర్ 2న 'సైరా' మూవీ జనం ముందుకు రావడమే!


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.